ఎస్సీ రైతులపై ఎస్సీ, ఎస్టీ చట్టం … హైకోర్టు ఆగ్రహం

రాజధానిలో ఎస్సీ రైతులపై ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రయోగించడంపై ఏపీ హైకోర్టు .. పోలీసు శాఖపై  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్సీ రైతులను 18 రోజులుగా జైల్లో ఎలా ఉంచుతారని ప్రశ్నించింది.? ఇలా చేస్తే రైతుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని న్యాయస్థానం పేర్కొంది.  రైతుల తరపున న్యాయవాది ఇంద్రనీల్ బాబు వాదనలు వినిపించగా ఆయన వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది.

రైతులను అరెస్ట్ చేసేందుకు సరైన కారణాలు  ఎందుకు చూపించలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కారం కింద తీసుకొనే అధికారం కోర్టుకు ఉందని తెలిపింది.  రాజ్యాంగం ప్రకారమే నడుచుకోవాలని ఇలా చేస్తే ప్రజలు ఎక్కడకెళ్తారని  హైకోర్టు పోలీసుల తీరును తప్పుబట్టింది. 

పోలీసులు దాఖలు చేసిన రిపోర్ట్‌ కూడా సరిగా లేదని విస్మయం వ్యక్తం చేసింది. ఇలా అయితే ‘రూల్ ఆఫ్ లా’ ఎలా అమలు చేస్తారని  హైకోర్టు ప్రశ్నించింది.

మరోవంక, విశాఖపట్టణంలో గెస్ట్ హౌస్ నిర్మాణంపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కాపులుప్పాడ కొండపై అతిథి గృహ నిర్మాణం చేపట్టవద్దని అమరావతి జేఏసీ నేతలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం న్యాయస్థానం విచారణ జరిపింది. 
 
పిటిషనర్ తరఫున న్యాయవాది మురళీధర్ వాదనలు వినిపించారు. గ్రే హాండ్స్‌కి ఇచ్చిన స్థలంలో అతిథి గృహం ఎలా నిర్మిస్తారని ప్రశ్నిస్తూ..వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.  ఈ వ్యవహారంలో కేంద్రాన్ని కూడా పార్టీ చేయాలని పేర్కొంది. అలాగే గెస్ట్‌ హౌస్‌కు కేటాయించిన 30 ఎకరాల్లో చెట్లు కూడా నరకవద్దని ఆదేశించింది.