అమరావతిలో ఆగిపోయిన అన్ని నిర్మాణాలు 

ఏపీ రాజధాని అమరావతిలో ప్రభుత్వం చేపట్టిన అన్ని నిర్మాణాలు ఆగిపోయాయి. అందుకు కారణం  నిర్మాణాలు చేపట్టిన సంస్థలకు ప్రభుత్వం బిల్లులు నిలిపేయడమే కారణమని ఆర్టీఐ దరఖాస్తు వెల్లడించింది. 

వాస్తవానికి అధికారమలోకి రాగానే వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం గత ప్రభుత్వం చేపట్టిన భారీ నిర్మాణాలలో  25 శాతంలోపు పూర్తయినవి మాత్రమే ఆపేయాలని గతంలో ఉత్తర్వులిచ్చింది. అయితే ఆచరణలో 80 శాతం పూర్తయినవి కూడా ఆపేశారు. 

ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతోనే పనులు నిలిపివేసినట్లు తాజాగా  వెలుగులోకి వచ్చింది. రాజధాని అమరావతి నిర్మాణం కోసం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అనేక భవనాల నిర్మాణాలకు టెండర్లు పిలిచింది. ప్రముఖ సంస్థలు పలు నిర్మాణాలు చేపట్టాయి. 24 గంటలు, 50 వేల మంది కార్మికులు అక్కడ పనిచేసేవారు. కొన్ని సంస్థలు తాము దక్కించుకున్న కాంటాక్టు నిర్మాణాలను 50 నుంచి 75 శాతం వరకు పూర్తి చేశాయి. ప్రభుత్వం మారిన తర్వాత నిర్మాణాలను ఎక్కడికక్కడ ఆపేయాలని ఉత్తర్వులిచ్చారు.

సమాచార హక్కు చట్టం ప్రకారం నరేంద్ర అనే వ్యక్తి సీఆర్డియేకు ధరఖాస్తు చేశారు. రాజధానిలో ఏయే నిర్మాణాలు చేపట్టారు? అవి ఏ దశలో ఉన్నాయి? ఎంత శాతం పూర్తయ్యాయి? ఎందుకు నిలిచిపోయాయి? అనే సమాచారాన్ని కోరారు. కాంట్రాక్టు కంపెనీలకు బిల్లులు చెల్లించకపోవడంతో వాటిని నిలిపివేశారని అధికారులు సమాచారం ఇవ్వడం గమనార్హం. 

మొత్తం రూ. 45వేల కోట్ల వరకు భవన నిర్మాణాలతోపాటుగా పలు రహదారులు చేపట్టారు. వాటన్నింటిని ప్రభుత్వం నిలిపివేసింది. ఆ తర్వాత మూడు రాజధానులుగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రాజధానిలో దాదాపు రూ. 9వేల కోట్లకు సంబంధించిన పలు నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి.