భారీ వర్షాలతో ఏపీలో 20 లక్షల ఎకరాలలో పంట నష్టాలు 

ఈ యేడాది ఖరీఫ్‌ ఆరంభం నుండి ఇప్పటివరకూ కురుస్తున్న భారీ వర్షాలు, ముంచెత్తుతున్న వరదలతో 20లక్షల ఎకరాల వరకు పంటలు దెబ్బతిని రైతులు కోలుకోలేని దెబ్బతిన్నారు. తాజాగా నివర్‌ తుపాను రాష్ట్రంలోని 10 జిల్లాలపై ప్రభావం చూపింది. వ్యవసాయ, ఉద్యానశాఖల పరిధిలో సుమారు 5లక్షల ఎకరాల్లోని పంటలు దెబ్బతిన్నాయి.

ప్రాథమిక అంచనా ప్రకారం రూ.1,004 కోట్ల పంటనష్టం వాటిల్లింది. కోతకు వచ్చిన వరిపైరు నీట మునిగింది. ఇంకా వర్షాలు కురవడం, వరదల కారణంగా నష్ట తీవ్రత మరింత పెరగనుంది. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 2.60లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. కృష్ణాజిల్లాలోనూ 70వేల ఎకరాల్లో నష్టం జరిగింది. ప్రకాశంలో 3,625ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం తలెత్తింది.

ప్రస్తుతం ఖరీఫ్‌, రబీలకు సంబంధించి చిత్తూరు, నెల్లూరు, కడప, ప్రకాశం, గంటూరు, కృష్ణా, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో సుమారు 47.73 లక్షల ఎకరాల్లో పంటలున్నాయి. ఇందులో 38 లక్షల ఎకరాల వరకు ఖరీఫ్‌ పంటలు సాగవుతున్నాయి. ఇందులో 13.59లక్షల్లో వరి సాగవుతోంది. అందులోనూ అధికశాతం కోత దశకు చేరింది. 

ప్రాథమిక అంచనా ప్రకారం 4.29లక్షల ఎకరాల్లో వరి దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఇందులో గుంటూరు జిల్లాలో 2.57లక్షల ఎకరాలు, కృష్ణాజిల్లాలో 70వేలు, తూర్పుగోదావరి 31వేలు, విశాఖపట్నం 16,300, చిత్తూరు జిల్లాలో 19వేలు, నెల్లూరు 17,900 ఎకరాల వరకు ఉండటం గమనార్హం. 

విజయనగరం, కడప, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ వరి దెబ్బతింది. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 7వేల ఎకరాల్లో వరినాళ్లు నీట మునిగాయి. గుంటూరు, కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాల్లో వరి కోత దశలో ఉంది. 

ఈ దశలో ఎడతెరపి లేకుండా రెండురోజులుగా వర్షాలు కురుస్తుడడంతో పైరు నేల వాలింది. కోత కోసిన ఓదెలు నీటిలో తేలుతున్నాయి. పొలాల్లోకి నీరు చేరడంతో కోతలూ నిలిచిపోయాయి. ఇప్పటికే కోసిన వరి ఓదెలపై నీరు చేరింది.

రాయలసీమతో పాటు ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో సెనగ సాగు మొదలైంది. ఇప్పటికే 5లక్షల ఎకరాల్లో విత్తనం వేశారు. కొన్నిచోట్ల పొలాలు సిద్ధం చేసి ఉంచారు. పొలాల్లో నీరు నిలవడంతో.. మొలకెత్తిన సెనగకు నష్టం తప్పదనే ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతోంది. 

చిత్తూరు జిల్లాలో రబీ వేరుసెనగ, ఉలవ పైర్లు నీటిలో ఉన్నాయి. ప్రకాశంలో రబీ మినుము అక్కడక్కడా నీట మునిగింది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పొగనారు నాటుతున్నారు. వర్షాలకు నీరు నిలవడంతో మొక్కలు చనిపోతాయేమోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భారీవర్షాలతో హొ7వేలకు పైగా ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా గుర్తించారు. కొన్నిచోట్ల పసుపు, ఉల్లి పంటలతో పాటు పూలతోటలూ నీట మునిగాయి. ఈ నష్టం ఇంకా పెరిగే అవకాశమూ ఉంది.