టీఆర్ఎస్ కార్పొరేటర్లకు ప్రచారంలో పరాభవం 

ఎన్నికలలో తిరిగి పోటీ చేస్తున్న టీఆర్ఎస్​ పార్టీ కార్పొరేటర్లకు ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఎక్కడికి వెళ్లినా గత ఎన్నికలలో చేసిన హామీలు ఏమయ్యాయి అంటూ  జనం చుక్కలు చూపిస్తున్నారు.  ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను చూసి డివిజన్ల ఇన్​చార్జిలు సైతం షాక్​ అవుతున్నారు. 
 
మొన్నటివరకు జనం సమస్యలు పట్టించుకోని కార్పొరేట్లరు ఇప్పుడు ప్రచారానికి వెళ్లడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. సమస్యల పరిష్కారంపై నిలదీస్తున్నారు. వారిని సముదాయించలేక గెలుపు బాధ్యతలను మీదేసుకున్న డివిజన్ల ఇన్​చార్జిలు సతమతమవుతున్నారు.  
 
ఈ విషయాన్నీ పార్టీ ఎమ్యెల్యేలు, సీనియర్ నాయకులు ముందే గ్రహించి ప్రస్తుత కార్పొరేటర్లలో తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉన్న దృష్ట్యా వారిలో మూడొంతుల మందిని మార్చాలని సూచించారు. కానీ కేటీఆర్ లెక్కచేయక పోవడంతో ఇప్పుడు అభాసుపాలవుతున్నామని వాపోస్తున్నారు. 
 
టీఆర్ఎస్​ కార్పొరేటర్లు 99 మంది ఉండగా 72 మందికి   మరోసారి టికెట్లను ఇచ్చారు. వీరితో పాటు గతంలో ఓటమిపాలైన వారిలో చాలామందికి మరోసారి అవకాశమిచ్చారు. అవకాశమిచ్చిన ఐదేళ్లలో ఏం చేశారని ఓట్లు వేయాలని ఎక్కడికక్కడ వీరందరిని ప్రజలు ఎక్కడికక్కడ ప్రశ్నిస్తున్నారు. వరద సాయం డబ్బులు కూడా ఇవ్వకుండా నేతలే మింగేశారని ఆరోపిస్తున్నారు.

మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్ కు మంగళవారం  ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది.  హిమాయత్​నగర్​లో వారు ప్రచారానికి వెళ్లగా తమకు వరద సాయం అందలేదని, వరదలతో కష్టాలు పడితే పట్టించుకోలేదని స్థానికులు తిరగబడ్డారు. చేసేదేం లేక వారు అక్కడి నుంచి వెనుదిరిగారు. 

ఇక ఉప్పల్​లో టీఆర్ఎస్ అభ్యర్థిని నిలదీశారు. వరద సాయం డబ్బులను మీరు మీరు పంచుకొని ఇప్పుడు ఓట్లకోసం మా వద్దకు వస్తారా అంటూ ఎదురు తిరిగారు. అల్వాల్ ఇన్​చార్జిగా ఉన్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ప్రచారంలో భాగంగా అభ్యర్థితో కలిసి జనం వద్దకు వెళ్లగా తమకేం చేయలేదని, ఓట్లు ఎలా వేయాలని ప్రశ్నించారు. డబుల్​ బెడ్​రూమ్​ఇండ్లు ఇస్తామని ఐదేళ్లయినా ఇవ్వలేదని మండిపడ్డారు. 

నేతలు  సముదాయించేందుకు ప్రయత్నించినా జనం వినలేదు. గుడిమల్కాపూర్​లోని భోజగుట్ట, వివేకానందనగర్​ కాలనీలో కూడా టీఆర్ఎస్​ నేతలను నిలదీశారు. తమకు డబుల్​బెడ్ రూమ్​ఇండ్లు ఇస్తామని నాలుగేళ్ల క్రితం ఖాళీ చేయించి ఇండ్లు ఇవ్వలేదని మండిపడ్డారు.