బీజేపీ గెలవగానే పాతబస్తీలో సర్టికల్ స్ట్రైక్  

‘‘ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే, మేయర్ పీఠం దక్కించుకుంటే.. బిడ్డా నీ పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తాం. రోహింగ్యాలను, పాకిస్థాన్ వారిని తరిమి తరిమి కొడతాం’’ అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్  హెచ్చరించారు. నగరంలో రోహింగ్యాలు ఉంటే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏం చేస్తున్నారని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

పాతబస్తీలో రోహింగ్యాలు, పాకిస్తాన్‌ వాసులే ఎంఐఎంకు ఓట్లేస్తున్నారని ఆరోపించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ మేయర్‌ పీఠాన్ని దక్కించుకోగానే పాతబస్తీపై సర్జికల్‌ స్ట్రైక్‌ ఖాయమని స్పష్టం చేశారు. మంగళవారం నగరంలోని ఉప్పల్, రామంతపూర్‌లో సంజయ్‌ ప్రచారం జరుపుతూ   టీఆర్‌ఎస్‌, ఎంఐఎం కుమ్మక్కై ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. గ్రేటర్‌  ఎన్నికల్లో బీజేపీ విజయంసాధించి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు.

జీహెచ్‌‌ఎంసీ ఎన్నికలు దేశభక్తులు, దేశద్రోహులకు మధ్య జరుగుతున్న యుద్ధమని సంజయ్ స్పష్టం చేశారు. భాగ్యలక్మి అమ్మవారి గుడికి రమ్మంటే కేసీఆర్ తోక ముడిచి ఫామ్‌‌హౌస్‌‌లో పడుకున్నాడని విమర్శించారు.

ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే విజయోత్సవ సభను భాగ్యనగర్ అమ్మవారి గుడి వద్ద జరుపుకుందామని ప్రకటించారు. ఈసారి జరగబోయేది ఎన్నికలు కాదు.. యుద్ధం. ఇది దేశభక్తులకు, దేశద్రోహులకు మధ్య జరుగుతున్న యుద్ధం అని వెల్లడించారు. 

భాగ్యనగర్‌‌ గడ్డపై కాషాయ జెండాను రెపరెపలాడించబోతున్నామని సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.”అవును, మాది హిందూ ధర్మమే. దేశంలో మెజారిటీ సంఖ్యలో ఉన్న హిందువుల తరఫున మేం నిలబడతాం. ఆ ధర్మం కోసమే బీజేపీ యుద్ధం చేస్తోంది” అని స్పష్టం చేశారు.

 హిందూ ధర్మాన్ని అవమానపరిస్తే అస్సలు ఊరుకోబోమని స్పష్టం చేశారు. రోహింగ్యాలు లేని హైదరాబాద్ కావాలని పేర్కొంటూ దేశద్రోహులకు ఇక్కడ స్థానం లేదని ప్రకటించారు. హైదరాబాద్‌‌ను మినీ పాకిస్థాన్, మినీ బంగ్లాదేశ్ కానివ్వబోమని భరోసా వ్యక్తం చేశారు.