టీఆర్ఎస్ మేనిఫెస్టో ఓ నీటి బుడగ  

టీఆర్ఎస్ మేనిఫెస్టో ఓ నీటి బుడగ వంటిదని,  2016 నాటి మేనిఫెస్టోను మక్కీకి మక్కి దించారని కేంద్రమంత్రి జి కిషన్​రెడ్డి విమర్శించారు.ప్రింట్ చేసిన పేపర్ మాత్రమే కొత్తదని, అందులోని మ్యాటర్  పాతదేనని ఎద్దేవా చేశారు. 

‘‘కేసీఆర్ విడుదల చేసిన  మేనిఫెస్టో చూస్తే ప్రజలకు జ్ఞాపకశక్తి లేదని ఆయన అనుకుంటున్నట్లు అర్థమవుతున్నది. 2016 మేనిఫెస్టోలోని హామీలు అమలు చేయని కేసీఆర్.. ఈ మేనిఫెస్టోలో కూడా మళ్లీ అవే రాశారు. అప్పటి, ఇప్పటి మేనిఫెస్టోపై సీఎంది అదే ఫొటో, అదే మ్యాటర్​, అదే ఫాంట్, అవే పదాలు ఉన్నాయి. అందులో కొత్తగా ఏమీ లేదు” అని ఆయన విమర్శించారు. 

హైదరాబాద్​లో లక్ష డబుల్​ బెడ్రూం ఇండ్లు కట్టకుంటే ఓట్లే అడుగనని 2017లో అసెంబ్లీ సమావేశాల్లోనే సీఎం కేసీఆర్ ప్రకటించారని, మరి ఇప్పుడు ఓట్లు అడిగే నైతికత కేసీఆర్ కు ఎక్కడిదని కిషన్​రెడ్డి నిలదీశారు. ఎన్ని ఇండ్లు కట్టించారో చెప్పాలని డిమాండ్ చేశారు. అరిగిపోయిన రికార్డు టీఆర్ఎస్ మేనిఫెస్టో అని దుయ్యబట్టారు. 

హైదరాబాద్ ను విశ్వ నగరం చేస్తామని చెప్పి విషాద నగరంగా మార్చారని కిషన్​రెడ్డి మండిపడ్డారు. ఆరున్నరేండ్లలో పేదలకు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వని టీఆర్ఎస్ సర్కార్.. ఇప్పుడు ఏ మొఖం పెట్టుకొని ఇస్తామని చెబుతోందని కిషన్​రెడ్డి మండిపడ్డారు.

సెలూన్లకు, దోబీ ఘాట్ లకు, పరిశ్రమలకు కరెంట్ బిల్లుల మాఫీ అంశం పాతదేనని పేర్కొన్నారు. మేనిఫెస్టో తయారీకి సమయం లేక పాతదే చదివినట్లు ఉందని ఎద్దేవా చేశారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఎందుకు తెరిపించలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలను టీఆర్ఎస్ ఆరేండ్లుగా మోసం చేస్తూ వస్తున్నందునే  ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు.

కేసీఆర్ మాటలు కోటలు దాటుతాయని, కానీ చేతలు మాత్రం ఫామ్ హౌజ్ దాటవని విమర్శించారు. గ్రేటర్ నడిబొడ్డున ఉన్న రోడ్లను ప్రైవేట్ వారికి ఎందుకిచ్చారో సమాధానం చెప్పాలని  డిమాండ్ చేశారు.  మెట్రో రైలు పాత బస్తీకి వెళ్లకుండా ఆగిపోవడానికి టీఆర్ఎస్  కారణం కాదా? అని  కిషన్​రెడ్డి ప్రశ్నించారు. 

ఓల్డ్ సిటీకి మెట్రో తీసుకెళ్లని టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు అక్కడి ఓటర్లపై మొసలి కన్నీరు కార్చడమేమిటని నిలదీశారు. ఈ రెండు పార్టీలకు అక్కడి జనం ఓట్లెందుకు వేయాలన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం ముందుకు వచ్చిన విషయం సీఎం చెపితే బాగుండేదని పేర్కొన్నారు. ఎంఎంటీఎస్ రెండో దశకు రాష్ట్ర సర్కార్ తన వాటా ఇవ్వనందుకే ఆగిపోయిందని ఆయన చెప్పారు.