ముందస్తు విడుదలపై శశికళకు ఆశాభంగం!

శిక్షా కాలంకన్నా ముందే విడుదలై వచ్చే ఏడాది మొదట్లో జరుగనున్న తమిళనాడు శాసనసభ ఎన్నికలలో చక్రం తిప్పాలని ఉవ్విలాడుతున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చలి అడియాసలు అయిన్నట్లే కనిపిస్తున్నాయి. సత్ప్రవర్తన పేరుతో డిసెంబర్ లోనే విడుదలకు ఆమె ప్రయత్నం చేసిన్నట్లు కనబడుతున్నది. 
 
గడువు కంటే ముందుగా విడుదల చేసే అవకాశం లేదని కర్ణాటక హోం మంత్రి బసవరాజ్‌ శుక్రవారం స్పష్టం చేయడం గమనార్హం.  ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.10 కోట్ల జరిమానాకు గురైన  శశికళ 2017 ఫిబ్రవరి 15వ తేదీ నుంచి బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో కాలం వెళ్లదీస్తున్నారు. 
 
ఇదే నేరంపై ఆమె బంధువులు ఇళవరసి, సుధాకరన్‌ సైతం అదే జైల్లో శిక్షను అనుభవిస్తున్నారు. కోర్టు తీర్పు ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండోవారంలో నాలుగేళ్ల శిక్షాకాలం ముగుస్తుంది.   సామాజిక కార్యకర్త నరసింహమూర్తి సమాచార హక్కు చట్టం కింద పంపిన ఉత్తరానికి “ 2021 జనవరిలో శశికళ విడుదలవుతారని’ జైలు సూపరింటెండెంట్‌ బదులిచ్చారు.
రూ.10. కోట్ల జరిమానా కూడా కోర్టుకు ఇటీవలే ఆమె చెల్లించారు. కర్ణాటక ప్రభుత్వ విధివిధానాలను అనసరించి శశికళకు మొత్తం 129 రోజుల సెలవులనుగా విడుదల చేయాలని శశికళ తరఫు న్యాయవాది ఇటీవల బెంగళూరు జైలు సూపరింటెండెంట్‌కు వినతిపత్రం సమర్పించాడు.
అయితే  కర్ణాటక హోంమంత్రి బసవరాజ్‌ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, అవినీతి నిరోధక చట్టం కింద శిక్షకు గురైనవారు కోర్టు తీర్పు ప్రకారం పూర్తికాలం జైలు జీవితాన్ని అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈనేరాలకు సత్ప్రవర్తన వర్తించదని తేల్చి చెప్పారు.
ఈ ప్రకారం శశికళ నాలుగేళ్లు పూర్తిగా జైలు జీవితం గడపాలి, ముందుగా విడుదలకు అవకాశాలు తక్కువని స్పష్టం చేశారు. చట్టాన్ని అనుసరించే శిక్షకాలం ఉంటుంది, ఇందులో రాజకీయ ప్రమేయానికి ఎంతమాత్రం చోటులేదని కూడా వివరణ ఇచ్చారు.
ముందస్తు విడుదలకు అవకాశం లేదని కర్ణాటక మంత్రి స్పష్టం చేయడంతో బెంగళూరు కోర్టులో పిటిషన్‌ వేయాలని శశికళ న్యాయవాదులు నిర్ణయించారు. జరిమానా చెల్లింపు కూడా పూర్తయినందున శశికళను వెంటనే విడుదల చేయా లని కోరుతూ పిటిషన్‌ ధాఖలు చేయనున్నారు.