భారత్ ను శత్రుదేశంగా చూస్తున్న చైనా 

అమెరికా సహా ఇతర దేశాలతో భారత దేశం సత్సంబంధాలు పెంచుకోవడాన్ని చూసి చైనా కళ్లల్లో నిప్పులు పోసుకుంటోంది.  భారత దేశం ఎదిగితే తన శత్రువు బలపడినట్లేనని చైనా భావిస్తోందని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ తాజా నివేదిక వెల్లడించింది.
 
అమెరికా సహా ఇతర దేశాలతో భారత దేశం సత్సంబంధాలు పెంచుకోవడాన్ని చూసి కళ్లల్లో నిప్పులు పోసుకుంటోంది. అమెరికా-భారత్ మధ్య మైత్రి బలపడుతుండటంతో ప్రపంచంలో అగ్ర దేశం స్థానం నుంచి అమెరికాను తప్పించాలని చైనా యత్నిస్తోంది. 
ఎదుగుతున్న భారత దేశం తనకు శత్రువు అని చైనా భావిస్తున్నట్లు ఈ నివేదిక పేర్కొంది. ఆర్థిక సంబంధాల ద్వారా తన ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించేలా భారత దేశాన్ని ప్రేరేపించాలని ప్రయత్నిస్తోందని తెలిపింది. 
 
మరోవైపు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇతర ప్రజాస్వామిక దేశాలతో భారత దేశపు వ్యూహాత్మక సంబంధాలను నిరోధించేందుకు చైనా ప్రయత్నిస్తోందని వివరించింది.  చైనా చాలా దేశాల భద్రత, స్వయంప్రతిపత్తి, ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీస్తోందని ఈ నివేదిక పేర్కొంది. ముఖ్యంగా మెకాంగ్ రీజియన్‌లోని దేశాలను, ఆగ్నేయాసియా దేశాలను, పసిఫిక్ దీవులను అణచివేస్తోందని పేర్కొంది.

ఇదిలావుండగా, అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పొంపియో గత నెలలో భారత దేశంలో పర్యటించిన్నప్పుడు భారత్, అమెరికా దేశాల నేతలు, ప్రజలు చైనా కమ్యూనిస్టు పార్టీ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారని పేర్కొనడం గమనార్హం.

 చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రజాస్వామ్యానికి మిత్రుడు కాదని భారత్, అమెరికా స్పష్టంగా అర్థం చేసుకున్నట్లు తెలిపారు. భారత దేశ సార్వభౌమాధికారం, స్వేచ్ఛాస్వాతంత్ర్యాలకు ఎదురయ్యే ముప్పును తిప్పి కొట్టడంలో అమెరికా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.