మూడోసారి కంగనా రనౌత్‌కు నోటీసులు

సంచలన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ను ముంబై పోలీసులు వెంటాడాడుతూనే ఉన్నారు.  మత ఉద్రిక్తతలను వ్యాప్తి చేసే లక్షంతో సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు ఈనెల 23, 24 తేదీలలో వరుసగా తమ ఎదుట హాజరుకావాలంటూ బాలీవుడ్ నటికంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలి చండేల్‌ను ముంబయి పోలీసులు తాజాగా సమన్లు జారీచేశారు. 
 
ఈ బాంద్రా పోలీసు స్టేషన్‌లో హాజరుకావావ్యవలంటూ వీరిద్దరినీ ముంబయి పోలీసులు ఆదేశించడం ఇది మూడవసారి. అక్టోబర్ 26, 27 తేదీలలో హాజరుకావాలంటూ ఇదివరకు ముంబయి పోలీసులు ఆదేశించినప్పటికీ కంగనా, ఆమె సోదరి హాజరుకాలేదు. ఆ తర్వాత నవంబర్ 9, 10 తేదీలలో హాజరుకావాలంటూ మరోసారి ఆదేశించినప్పటికీ వారు హాజరుకాలేదు. 
 
తమ కుటుంబంలో జరిగే ఒక పెళ్లి కార్యక్రమంలో తాను బిజీగా ఉన్నానని, నవంబర్ 15 తర్వాత తాను అందుబాటులో ఉంటానని ముంబయి పోలీసులకు కంగన గతంలో సమాచారం అందచేశారు. సోషల్ మీడియా పోస్టింగుల ద్వారా రెండు మతాల మధ్య విద్వేషాన్ని రగలుస్తున్నారన్న ఆరోపణలపై కంగన, రంగోలి మీద కేసులు నమోదు చేసిన పోలీసులు వారికి మొత్తం మూడుసార్లు నోటీసులు జారీచేశారు. 
 
కంగనా, ఆమె సోదరి సోషల్ మీడియాలో పోస్టు చేసిన ట్వీట్లు, వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ బాలీవుడ్ క్యాస్టింగ్ డైరెక్టర్, ఫిట్‌నెస్ ట్రెయినర్ మునావర్ ఆలీ సయ్యద్ చేసిన ఫిర్యాదును దర్యాప్తు చేయవలసిందిగా బాండ్రా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ గత నెలలో పోలీసులను ఆదేశించారు. 
 
దీనిపై కంగనా రనౌత్, ఆమె సోదరిపై ఐపిసిలోని వివిధ సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. బాంద్రా పోలీసు స్టేషన్‌లో హాజరుకావాలంటూ వారికి నోటీసులు కూడా పోలీసులు జారీచేశారు.