మంత్రి కొడాలి నానిపై గవర్నర్‌కు ఫిర్యాదు

మంత్రి కొడాలి నానిపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫిర్యాదు చేశారు. అసభ్యపదజాలమే కాకుండా ఎన్నికల నిర్వహణపై పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆ లేఖలో పేర్కొన్నారు. 

ఉద్యోగులను ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే విధంగా మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు చేస్తున్నారని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.

మంత్రి కొడాలి నాని నిన్న ఎన్నికల కమిషన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, పత్రికల్లో వచ్చిన క్లిప్లింగులు, వీడియోలను నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్‌కు పంపిన లేఖతోపాటు పంపించారు. వెంటనే మంత్రిపై తగిన చర్యలు తీసుకోవాలని నిమ్మగడ్డ గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.

నిమ్మగడ్డకు రాజ్యాంగ వ్యవస్థలపై, రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేదని మంత్రి నాని ధ్వజమెత్తారు. నిమ్మగడ్డ చిల్లర రాజకీయాలు చేయకుండా హుందాగా ఉండాలని హితవు పలికారు. ఒకవైపు కోవిడ్ కేసుల తీవ్రత ఉన్నా ఎన్నికలు నిర్వహిస్తామనడం అవివేకమని విమర్శించారు. 

హైదరాబాద్‌లో కూర్చొనే అజ్ఞాతవాసి నిమ్మగడ్డ రమేష్‌ అని సెటైర్‌ వేశారు. జూమ్ బాబుతో చేతులు కలిపి ప్రజలకు నష్టం కలిగించేలా, ఎన్నికలు నిర్వహిస్తామంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మంత్రి కొడాలి నాని హెచ్చరించారు.