బాలికపై పాస్టర్ లైంగిక దాడి  

పదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన పాస్టర్‌పై పోక్సో కేసు నమోదైంది. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిందీ ఘటన. నగరంలోని రైల్వే ఓవర్‌ బ్రిడ్జి పక్కనున్న ఓ కాలనీకి చెందిన తేళ్ల అపోలో స్థానిక చర్చిలో పాస్టర్‌. ఆయన విద్యార్థులకు ట్యూషన్‌ కూడా చెబుతుంటారు. 
 
అదే కాలనీకి చెందిన నాలుగో తరగతి విద్యార్థిని ట్యూషన్‌తోపాటు, ప్రార్థనా మందిరానికి వస్తోంది. చిన్నతనంలోనే ఆమె తల్లిదండ్రులు మృతి చెందడంతో అమ్మమ్మ వద్ద ఉండి చదువుకుంటోంది. దీన్ని ఆసరాగా చేసుకున్న పాస్టర్‌ ఆ బాలికపై కన్నేశాడు. 
 
పది రోజుల క్రితం స్వీట్లు ఇస్తానంటూ ఇంట్లోకి పిలిచి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎవ్వరికీ చెప్పవద్దని ఆమెను బెదిరించాడు. ఐదు రోజుల క్రితం మరోసారి లైంగికదాడికి పాల్పడ్డాడు. 
 
పసిగట్టిన బాలిక స్నేహితులు విషయాన్ని ఆమె పిన్నికి చేరవేయగా, ఆదివారం దిశ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.