లడఖ్ లో జీరోకు చేరుకున్న ఉష్ణోగ్రతలు… గస్తీలో సైన్యం

తూర్పు లఢఖ్‌లోని 1,597 కిలోమీటర్ల పొడవైన వాస్తవాధీన రేఖ (ఎల్‌ఎసి) వెంట ఉష్ణ్రోగ్రతలు జీరోకు చేరుకున్నాయి. గాలిలో తేమ తీవ్రత పెరిగింది. లఢఖ్‌లోని గౌలెట్‌ బేగ్‌ ఓల్టి సెక్టార్‌లో మంచు తుఫాన్‌ కురిసింది. అయినప్పటికీ భారత సైనికులు అన్ని ప్రాంతాల్లోనూ తమ స్థానాల్లో ఒక అంగుళం మార్పు కూడా చేయలేదు. 
 
ఇటీవల భారత్‌, చైనాలు వాస్తవాధీన రేఖ వెంబడి సైనికుల ఉపసంహరణ ప్రతిపాదనను అమలు చేయనున్నట్లు వెల్లడైనప్పటికీ.. భారత సైనిక స్థావరాల్లో ఎటువంటి మార్పులు చేయలేదు. ప్రతికూల వాతావరణం కారణంగా భారత దళాలు గుడారాలు, ఇగ్లూలలో ఉంటున్నారు. 
ఎల్‌ఎసి వద్ద కంటైనర్లలో నివసిస్తున్నారు. ఎల్‌ఎసి అంతటా ప్రత్యేక దళాలను మోహరించడంతో పాటు బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ అన్ని ఎత్తైన పర్వతాలపైన కూడా సైన్యాలను మోహరించింది.
మార్సిమికాలా (హాట్‌ స్ప్రింగ్స్‌కు సమీపంలో 18,314 అడుగులు), చాంగ్‌ లా ( పాంగోంగ్‌ త్సో రహదారికి సమీపంలో 17,582 అడుగుల ఎత్తు), ఖార్డంగ్‌ లా ( 17,582 అడుగుల ఎత్తు)లో కూడా సైన్యం తమ విధులను నిర్వహిస్తోంది. సైనిక కమాండర్ల స్థాయిలో చర్చలు ఇంకా కొనసాగుతున్నందున దశల వారీగా సైన్యాల బేస్‌మెంట్‌లో మార్పులు తీసుకోవడం అనేది జరగదని ఉన్నత సైనిక కమాండర్‌ అన్నారు.