సుజనాచౌదరి అమెరికా యాత్రకు షాక్!

బ్యాంక్‌ కుంభకోణం కేసులో లుక్‌అవుట్‌ నోటీసులు జారీకావడంతో అమెరికాకు బయలుదేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిని శుక్రవారం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అడ్డుకున్నారు. లుక్‌ అవుట్‌ నోటీసుల ఆధారంగా ఇమిగ్రేషన్‌ అధికారులు అతన్ని నిలిపివేశారు.

మరోవైపు తాజా నోటీసులపై ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనను అక్రమంగా అడ్డుకున్నారని, లుక్‌ఔట్‌ నోటీసులు రద్దు చేయాలని పిటిషన్‌ దాఖలు చేశారు. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు రూ.322.03 కోట్ల రుణం ఎగవేతకు పాల్పడ్డ విషయం తెలిసిందే.

వడ్డీతో కలిపి రూ.400.84 కోట్లకు చేరుకోవడంతో వేలానికి నోటీసు ఇచ్చింది. తిరిగి చెల్లించాలని ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా సుజనా చౌదరి స్పందించకపోవడంతో తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేసేందుకు బ్యాంకు సిద్ధమైంది.

కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి చెందిన సంస్థల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) గతంలో భారీ ఎత్తున సోదాలు జరిపింది. సుజనా గ్రూపు సంస్థలు బ్యాంకులను ఏకంగా రూ.5,700 కోట్ల మేర మోసం చేశాయని స్పష్టంగా ఆరోపించింది. ఈ మొత్తాలను బ్యాంకుల నుంచి తీసుకొని ఎగవేశాయనేందుకు గట్టి ఆధారాలు లభించాయని పేర్కొంది.

సుజనా గ్రూపులకు చెందిన సంస్థల్లో మరోసారి సోదాలు సాగించిన ఈడీ అధికారులు.. డొల్ల కంపెనీల పేర్లతో రిజిస్ట్రేషన్‌ చేసిన ఆరు ఖరీదైన కార్లను (ఫెరారీ, రేంజ్‌ రోవర్‌, బెంజ్‌ తదితర) స్వాధీనం చేసుకొన్నారు. సుజనా గ్రూప్‌ సంస్థల్లో చాలా మటుకు మనుగడలో లేవని, కేవలం కాగితాలపైనే కొనసాగుతున్నాయని దర్యాప్తు అధికారులు వెల్లడించారు.

సుజనా చౌదరి వ్యక్తిగత పూచీకత్తుపై బ్యాంకులు రూ.5,700 కోట్లు రుణం ఇచ్చాయని తెలిపారు. నిజానికి, చెన్నైలో నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా 2018 అక్టోబరులో సుజనా చౌదరి సంస్థల్లో ఈడీ తనిఖీలు జరిపింది. ఆ తనిఖీల్లో లభించిన ఆధారాలు, కేసు దర్యాప్తులో భాగంగా మరోసారి చెన్నై ఈడీ బృందం హైదరాబాద్‌కు‌ వచ్చి, నాగార్జున హిల్స్‌లోని బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌ సంస్థలో తనిఖీలు నిర్వహించింది.

హైదరాబాద్‌లోని ఏడు వేర్వేరు ప్రాంతాలతోపాటు ఢిల్లీలో మరోసారి తనిఖీలు చేపట్టామని ఈడీ అధికారులు తెలిపారు. సుజనా గ్రూప్‌ సంస్థలు బ్యాంకుల్ని రూ.5,700 కోట్లు మోసగించినట్లు తేలిందన్నారు.

సుజనా గ్రూప్‌ సంస్థలపై ఫెమా, డీఆర్‌ఐ, సీబీఐ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. 120 సంస్థల పేర్లతో నగదు లావాదేవీలు నిర్వహిస్తున్నారని, అందులో చాలా మటుకు సంస్థలు మనుగడలో లేవని తెలిపారు. సుజనా చౌదరి వ్యక్తిగత పూచీకత్తుపై ఆయా సంస్థలకు బ్యాంకులు రుణాలు ఇచ్చాయన్నారు.

తప్పుడు పత్రాలతో బ్యాంకుల్ని రూ.364 కోట్లు మోసగించారన్న బ్యాంకర్ల ఫిర్యాదుతో సీబీఐ బెంగళూరు విభాగం గతంలో మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. చెన్నైలోని బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌ ఇంజనీరింగ్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ తప్పుడు పత్రాలతో సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి రూ.133 కోట్లు, ఆంధ్రాబ్యాంకు నుంచి రూ.71 కోట్లు, కార్పొరేషన్‌ బ్యాంకు నుంచి రూ.159 కోట్లు రుణం తీసుకున్నదని సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పొందుపర్చింది

ఈ ఎఫ్‌ఐఆర్‌ మేరకు పీఎంఎల్‌ఏ చట్ట ప్రకారం ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా 2018, అక్టోబరు 8న బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌ ఇంజనీరింగ్‌ ప్రాజెక్ట్స్‌కు సంబంధించి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లోని ముఖ్యుల ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌ నాగార్జున హిల్స్‌లోని కార్యాలయంలో జరిపిన తనిఖీల్లో వేర్వేరు డొల్ల కంపెనీలకు చెందిన 126 రబ్బరు స్టాంపులను ఈడీ స్వాధీనం చేసుకుంది.

నాగార్జున సర్కిల్‌లోని ఈ సంస్థ ఆవరణలో సుజనా గ్రూపునకు సంబంధించిన పలు సంస్థల్ని నెలకొల్పినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. తనిఖీల్లో లభించిన ఆధారాలు, దర్యాప్తు ఆధారంగా సుజనా గ్రూప్‌ సంస్థలు… సుజనా చౌదరి చైర్మన్‌షిప్‌లో కొనసాగుతున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు.

సుజనా చౌదరి ప్రత్యక్ష ఆదేశాలు లేక ఆయన సంస్థ కార్యదర్శి లేక సీఎ్‌ఫవో ఆదేశాల మేరకు సుజనా గ్రూప్‌ సంస్థలు పనిచేశాయని దర్యాప్తు సంస్థ వెల్లడించింది. ఆ సంస్థలకు డైరెక్టర్లుగా ఉన్న వారిని విచారించినపుడు, తాము కేవలం సుజనా చౌదరి ఆదేశాల మేరకే పనిచేస్తామని, బ్యాంకుల్లో నగదు మార్పిడికి సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదని వెల్లడించినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు.