యాక్ట్ ఈస్ట్ పాలసీకి కేంద్రం ఆసియాన్   

యాక్ట్ ఈస్ట్ పాలసీకి కేంద్రం ఆసియాన్   
భారత్ అనుసరిస్తున్న యాక్ట్ ఈస్ట్ పాలసీకి కేంద్రం ఆసియాన్ అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 17వ ఆసియాన్-ఇండియా వర్చువల్ సదస్సులో ఆయన మాట్లాడుతూ భారత దేశపు పసిఫిక్ విజన్‌కు ఆసియాన్ (ఆగ్నేయాసియా దేశాల సంఘం) ముఖ్యమైనదని చెప్పారు.
 
ఆగ్నేయాసియా దేశాలతో భారత దేశ సంబంధాలకు చారిత్రక, భౌగోళిక, సాంస్కృతిక వారసత్వం ప్రాతిపదిక అని చెబుతూ ఇండో పసిఫిక్ సముద్రం విషయంలో భారత దేశం, ఆసియాన్ విధానాల్లో సారూప్యత ఉందని పేర్కొన్నారు.
ఈ ప్రాంతంలో అన్ని దేశాల భద్రత, అభివృద్ధి కోసం సమన్వయం, స్పందించే తత్త్వంగల ఆసియాన్ అవసరమని చెప్పారు. ఆసియాన్‌తో అన్ని రకాలుగా అనుసంధానాన్ని ఏర్పరచుకోవడానికి భారత దేశం ప్రాధాన్యమిస్తుందని స్పష్టం చేశారు. 

17వ ఇండియా-ఆసియాన్ సదస్సుకు ప్రధాని మోదీతోపాటు వియత్నాం ప్రధాన మంత్రి ఎన్‌గుయెన్ సహాధ్యక్షత వహించారు. ఆసియాన్-ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్యం, కనెక్టివిటీ, మారిటైమ్ కోఆపరేషన్, వాణిజ్యం, విద్య, కెపాసిటీ బిల్డింగ్ తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు. 

ఆసియాన్ సభ్య దేశాలు : ఇండోనేషియా, మలేసియా, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, బ్రూనే, వియత్నాం, లావోస్, మయన్మార్, కాంబోడియా. కాగా ఆసియాన్ డయలాగ్ భాగస్వాములుగా భారత దేశం, చైనా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా వ్యవహరిస్తున్నాయి.