ఉగ్రవాదం, మాదక ద్రవ్యాలు ప్రపంచానికి ముప్పు

ఉగ్ర‌వాదం, మ‌నీలాండ‌రింగ్‌, మాద‌క‌ద్ర‌వ్యాల ర‌వాణా ప్ర‌పంచానికి పెనుముప్పుగా ప‌రిణ‌మించాయ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ హెచ్చరించారు.   మంగళవారం జ‌రిగిన‌ షాంఘై సహకార సంస్థ (ఎస్ సి ఓ) వర్చువల్ కాన్ఫరెన్స్‌లో పాల్గొంటూ భారత్  వీటికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. 
 
ఆత్మనిర్భర్‌ భారత్ నేడు ప్రపంచానికి ఓ శక్తి గుణకంగా మారింద‌ని చెప్పారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ నేతృత్వంలో జరిగిన ఈ సదస్సుకు మోదీతో పాటు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ హాజ‌ర‌య్యారు.  సభ్య దేశాలు ఒకరి సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత మరొకరు గౌరవించాలని చైనా, పాకిస్తాన్ లను పరోక్షంగా ప్రస్తావిస్తూ సూచించారు. 
 
ఐకరాజ్యసమితి 75 ఏండ్లు పూర్తి చేసుకుంది. ఈ ప్రయాణంలో అనేక విజయాలు సాధించినప్పటికీ, ఐకరాజ్య సమితి ప్రాథమిక లక్ష్యం ఇప్పటికీ అసంపూర్ణంగానే ఉందని ప్రధాని విచారం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి విజృంభించిన ఈ కష్ట సమయంలో భారత్‌లోని ఔషధ పరిశ్రమ 150కి పైగా దేశాలకు అవసరమైన మందులను అంద‌జేసిందని గుర్తు చేశారు. 
 
ప్రపంచంలోనే అందరికంటే మెరుగైన టీకా ఉత్పత్తి చేసే దేశంగా భారత్ నిలిచిందని చెప్పారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో మొత్తం మానవాళికి సహాయపడటానికి భారత్ తన టీకా ఉత్పత్తి, పంపిణీ సామర్థ్యాన్ని ఉపయోగిస్తున్న‌దని మోదీ తెలిపారు.