జమ్మూ – కశ్మీర్ మాచిల్ సెక్టార్లోని నియంత్రణ రేఖ వెంట ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు జవాన్లు వీర మరణం పొందారు. వీరితో పాటు ఓ సైనికాధికారి, బీఎస్ఎఫ్ జవాను సైతం ప్రాణాలు కోల్పోయారు. చొరబాటుకు యత్నించిన ముష్కరులను అడ్డుకునే క్రమంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.
ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. ప్రాణాలు కోల్పోయిన సైనికుల్లో తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమన్పల్లి గ్రామానికి చెందిన జవాను ర్యాడా మహేష్(26), ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా రెడ్డివారిపల్లెకు చెందిన ప్రవీణ్కుమార్రెడ్డి(36) ఉన్నారు.
శనివారం అర్ధరాత్రి సమయంలో కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి అనుమానాస్పద కదలికలను గమనించిన సైన్యం గాలింపు చేపట్టింది. అయితే ఉగ్రవాదులు కాల్పులకు దిగారని సైనిక ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
ఈ ఘటనలో నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారని, ముగ్గురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టారని తెలిపారు. వారి వద్ద నుంచి ఒక ఏకే రైఫిల్తో పాటు రెండు బ్యాగులు స్వాధీనం చేసుకున్నారు.
ర్యాడా మహేష్(26)కు రెండేళ్ల క్రితమే వివాహమైంది. హైదరాబాద్కు చెందిన సైనిక కమాండర్ కూతురు సుహాసిణిని ప్రేమ వివాహం చేసుకొన్నారు. ఇంకా పిల్లలు లేరు. గత డిసెంబరులో స్వగ్రామానికి వచ్చిన మహేష్ అదే నెలలో తిరిగి విధులకు బయలుదేరారు.
ఆర్మీలో చేరాలన్న లక్ష్యంతో పట్టుదలతో చదివి 2014-15లో మహేష్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. మహేష్ వీలున్న ప్రతి వారం, 10 రోజులకు ఒకసారి తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడేవారు. మీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పేవారు.
చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని ఐరాల పంచాయతీ రెడ్డివారిపల్లెకు చెందిన చీకల ప్రతాప్రెడి,్డ సుగుణమ్మ కుమారుడు ప్రవీణ్కుమార్రెడ్డి(36) గత 18 సంవత్సరాలుగా మద్రాస్ రెజిమెంట్లో సైనికుడిగా పనిచేస్తున్నాడు. అతడు హవల్దార్గా పనిచేస్తూ కమెండో శిక్షణ తీసుకున్నాడు.
ప్రస్తుతం కశ్మీర్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రవీణ్కుమార్కు భార్య రజిత, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన భౌతికకాయం సోమవారం రాత్రి స్వగ్రామం చేరుకుంటుందని గ్రామస్థులు తెలిపారు.
“దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదులను కట్టడి చేసే క్రమంలో మన సేనల నుంచి నలుగురు అసువులు బాయడం బాధాకరం. దేశ భక్తితో, తెగింపుతో జమ్మూ కశ్మీర్ మాచిల్ సెక్టార్ లో వీర సైనికులు చేసిన పోరాటం అందరూ గుర్తుపెట్టుకుంటారు. వారికి నా తరఫున, జనసేన తరఫున శాల్యూట్ చేస్తున్నాను”అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
“వీర మరణం పొందిన వారిలో ఉన్న మన తెలుగు రాష్ట్రాలకు చెందిన చీకల ప్రవీణ్ కుమార్ రెడ్డి, ర్యాడా మహేష్ ల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను” అని ఆయన తెలిపారు. ప్రవీణ్ కుమార్ రెడ్డి, ర్యాడా మహేష్ ల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకొని, అండగా నిలవాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలను పవన్ కోరారు.
More Stories
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిపై ఈసీ వేటు
సీఎం జగన్ను హత్య చేసేందుకే దాడి
వైఎస్ వివేకా హత్యపై మాట్లాడొద్దన్న కడప కోర్టు