అయ్యప్ప ప్రసాదం ఇక నుంచి భక్తుల ఇంటికే

శబరిమల అయ్యప్ప ప్రసాదం ఇక నుంచి నేరుగా భక్తుల ఇంటికే చేరనుంది. ప్రసాదాన్ని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే స్పీడుపోస్టులో ఆలయ బోర్డు ఇంటికే పంపనుంది. శుక్రవారం నుంచి ప్రసాదం ఆన్‌లైన్ బుకింగ్స్ సేవను ప్రారంభించినట్లు శబరిమల ఆలయ నిర్వాహక సంస్థ (ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు) ప్రకటించింది. 

ప్రసాదం ధరను రూ. 450గా నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో స్వామివారి ప్రసాదాన్ని బుక్ చేసుకున్న వారికి అరవాన్న పాయసంతో పాటు పవిత్ర విబూది, గంధం పేస్టు, పసుపు పొడి, పూలు అందించనున్నారు. ఈ నెల 16 నుంచి ప్రసాదం పంపిణీ సేవ ప్రారంభం కానుంది.

కరోనా సమయంలో నష్టపోయిన ఆదాయాన్ని సమకూర్చుకు నేందుకే ప్రసాదాన్ని ఆన్‌లైన్ ద్వారా విక్రయించాలని ట్రావెన్‌కోర్ బోర్డు నిర్ణయించిందని అధికారులు తెలిపారు. ప్రసాద పొట్లాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి సాధ్యమైనంత త్వరగా భక్తులకు అందిస్తామని తపాలాశాఖ అధికారులు పేర్కొన్నారు.

ఈ సీజన్‌లో రోజుకు వెయ్యి మంది భక్తులు శబరిమలను దర్శించుకునేందుకు ప్రభుత్వ అనుమతి ఇచ్చింది. కాగా ఆర్థిక నష్టాన్ని పూడ్చుకునేందుకు భక్తుల సంఖ్యను మరింత పెంచాలని ట్రావెన్‌కోర్ బోర్డు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. నవంబర్ నుంచి మూడునెలలపాటు భక్తుల దర్శనార్థం ఆలయం తెరుచుకోనున్న విషయం తెలిసిందే.