పీఎస్ఎల్వీ సీ-49 రాకెట్ ప్రయోగం విజయవంతం

పీఎస్ఎల్వీ సీ-49 రాకెట్ ప్రయోగం విజయవంతం అయ్యింది. 13.55 నిమిషాల్లో ప్రయోగం పూర్తయ్యింది. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్‌ను నిర్ణీత కక్ష్యలో శాస్త్రవేత్తలు ప్రవేశ పెట్టారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌లో ఉన్న మొదటి ప్రయోగ వేదిక నుంచి ఒక స్వదేశీ, 9 విదేశీ ఉపగ్రహాలతో పీఎస్‌ఎల్వీ-సీ49 రాకెట్‌ను ప్రయోగించారు. 

ఈ రాకెట్‌ ద్వారా మన దేశానికి చెందిన భూ పరిశీలన ఉపగ్రహం ఈవోఎస్-01తో పాటు అమెరికా, లక్సెంబర్గ్‌ దేశాలకు చెందిన ఉపగ్రహాలు నాలుగు చొప్పున, లిథువేనియా దేశానికి చెందిన ఒక ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యల్లో ప్రవేశపెట్టారు.   ఆంధ్ర ప్రదేశ్‌లోని శ్రీహరికోట, సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి శనివారం మధ్యాహ్నం 3.12 గంటలకు ఈ ప్రయోగం జరిగింది. 

 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. కోవిడ్-19 మహమ్మారి విసిరిన భారీ సవాళ్ళను శాస్త్రవేత్తలు అధిగమించారని ప్రశంసించారు. 

పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్‌వీ)ని విజయవంతంగా ప్రయోగించినందుకు హర్షం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలు అనేక అవరోధాలను అధిగమించి ఈ ప్రయోగాన్ని సకాలంలో నిర్వహించి విజయం సాధించారన్నారు. 

మోదీ ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘ఈ రోజు పీఎస్ఎల్‌వీ సీ49/ఈఓఎస్-01ను విజయవంతంగా ప్రయోగించినందుకు ఇస్రోను, భారత దేశపు స్పేస్ ఇండస్ట్రీని అభినందిస్తున్నాను. కోవిడ్-19 మహమ్మారి సమయంలో మన శాస్త్రవేత్తలు నిర్ణీత గడువును చేరుకునేందుకు అనేక అవరోధాలను అధిగమించారు’’ అని పేర్కొన్నారు.