అమెజాన్‌ రూ 20,761 కోట్లతో వెబ్‌ సర్వీసెస్‌ కేంద్రం

తెలంగాణలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్)  ప్రపంచంలో అతిపెద్ద క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్‌‌ఫామ్‌‌లో  ఒకటైన ఏడబ్ల్యూఎస్ ను రూ 20,761 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేయనున్నది. క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగంలో పేరుగాంచిన అమెరికాకు చెందిన అమెజాన్‌ వెబ్‌సర్వీసెస్‌ హైదరాబాద్‌ను భారత్‌లో తమ రెండో ఏడబ్ల్యూఎస్‌ రీజియన్‌గా ఎంచుకున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు.

తెలంగాణ చరిత్రలోనే  ఇది అతిపెద్ద ప్రత్యక్ష విదేశీ పెట్టుబడి కాగలదు. ఈ సెంటర్‌ను 2022లో అందుబాటులోకి తెస్తామని అమెజాన్‌ సంస్థ ప్రకటించింది. హైదరాబాద్‌‌లో మూడు అవైలబులిటీ జోన్లతో(ఏజెడ్‌‌లు) ఏడబ్ల్యూఎస్ ఆసియా–పసిఫిక్ రీజియన్‌‌ను ఏర్పాటు చేస్తున్నట్టు వర్చ్యువల్ మీటింగ్‌‌లో ఏడబ్ల్యూఎస్ తెలిపింది. 

భారత్, ఆస్ట్రేలియా, చైనా, జపాన్, కొరియా, సింగపూర్‌‌‌‌లలో ఏడబ్ల్యూఎస్‌‌కు 26 అవైలబులిటీ జోన్లు ఉన్నాయి.  ప్రపంచవ్యాప్తంగా 77 అవైలబులిటీ జోన్లు ఉండగా,  భారత్,  ఇండోనేషియా, జపాన్, స్పెయిన్, స్విట్జర్లాండ్‌లలో మరో ఐదు ఏడబ్ల్యూఎస్ రీజియన్లను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పింది.

డేటా ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ స్పేస్‌‌లో ఏడబ్ల్యూఎస్ కంపెనీ మైక్రోసాఫ్ట్, గూగుల్‌‌ వంటి గ్లోబల్ దిగ్గజాలతో పోటీ పడుతోంది. ఏడబ్ల్యూస్ భారత్ లో  తన తొలి రీజియన్‌‌ను 2016లో ముంబైలో ఏర్పాటు చేసింది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై, న్యూఢిల్లీ, కోల్‌‌కతాలలో ఎడ్జ్ లొకేషన్ల ద్వారా తన సర్వీసులను విస్తరిస్తోంది.

అమెజాన్‌ నిర్ణయం పట్ల మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తంచేశారు. తెలంగాణలో ఏర్పాటవుతున్న అమెజాన్‌ వెబ్‌సర్వీసెస్‌ లాంటి డాటా సెంటర్ల ద్వారా తెలంగాణ డిజిటల్‌ ఎకానమీ, ఐటీ రంగం మరింత వృద్ధి చెందనున్నాయి. దీంతో డెవలపర్లు, స్టార్టప్‌లకు మరింత ఊతం లభించనుంది. ఫలితంగా.. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల సంఖ్యలో యువతకు ఉపాధి లభించనుంది.