బిజెపి వైపు చూస్తున్న గ్రేటర్‌వాసులు 

గ్రేటర్‌వాసులు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తీరుపై ఆగ్రహంగా ఉన్నారని, వారంతా బీజేపీవైపు చూస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి. కిషన్‌రెడ్డి తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా బీజేపీదే విజయమని ధీమా వ్యక్తంచేశారు.

బీజేపీ అంబర్‌పేట నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ గ్రేటర్‌లో పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని కోరారు. మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆయన చెప్పారు. 

పొదుపు గ్రూపు సంఘాలకు వివిధ బ్యాంకుల ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.10నుంచి 20 లక్షల వరకు రుణాలు అందిస్తోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. 

కాగా, చలికాలంతోపాటు పండుగల సీజన్‌ కావడంతో కొవిడ్‌ వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున, వచ్చే మూడు నెల లు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సూచించారు. ఆయన గోల్నాక డివిజన్‌లోని తిరుమలనగర్‌కు చెందిన వెంకటరాంరెడ్డికి సీఎంఆర్‌ఎఫ్‌ కింద మంజూరైన రూ.45వేల చెక్కును అందజేశారు.