అమరావతి భూములపై విచారణ వాయిదా 

అమరావతి భూముల అంశంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్‌ను విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే వాదనలు వినిపించారు. 
సిఆర్‌డిఎ ప్రాంతంలోని భూముల అంశంలో అవకతవకలు జరిగాయని కేబినెట్‌ సబ్‌కమిటీ నివేదిక ఇచ్చిందని దుష్యంత్‌ దవే సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపారు. సబ్‌ కమిటీ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసిందని, దర్యాప్తు ప్రాథమిక దశలోనే హైకోర్టు స్టే ఇవ్వడం సరికాదని దుష్యంత్‌ దవే వాదించారు. 

అమరావతి భూ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ కూడా రాసినట్లు గుర్తుచేశారు.దీనిపై స్పందించిన న్యాయస్థానం టీడీపీ ప్రభుత్వ నిర్ణయాలన్నింటిపైనా దర్యాప్తు చేస్తారా? అని ప్రశ్నించింది. దీనిపై న్యాయవాది దుష్యంత్‌ దవే వివరణ ఇస్తూ.. అలాంటిది ఏమీ లేదని, అక్రమాలు చోటు చేసుకున్న విషయాలపైన మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ సిట్ దర్యాప్తు జరుపుతోందని స్పష్టం చేశారు. సిట్‌ దర్యాప్తు విషయంలో హైకోర్టు జోక్యం చేసుకోకూడని వాదించారు.

‘కొందరు ఆర్టికల్‌ 226 ప్రకారం సిట్‌ దర్యాప్తుపై హైకోర్టులో పిటిషన్లు వేశారు. వ్యక్తిగతంగా ప్రభావితమైతే తప్ప ఆర్టికల్‌ 226 ప్రకారం రిట్‌ దాఖలు చేయలేరు. సిట్‌ దర్యాప్తుతో ఎలాంటి సంబంధం లేనివారు పిటిషన్లు దాఖలు చేశారు. హైకోర్టుకు అసాధారణ అధికారాలు లేవని.. సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడాల్సిందే’ అని న్యాయవాది దుష్యంత్‌ దవే పేర్కొన్నారు.

మరోవైపు ఈ కేసులో భాగంగా టీడీపీ నేతలు వర్ల రామయ్య సహా ప్రతి వాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. తదుపరి విచారణలో తుది వాదనలు వింటామని జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం స్పష్టం చేసింది.