పోలవరంపై వివాదం సృష్టిస్తున్న వైసిపి, టిడిపి 

పోలవరం విషయంలో టీడీపీ, వైసీపీ నేతలు వివాదం సృష్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఎద్దేవా చేశారు.  దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో డబ్బులు ఇచ్చిన రైతులను మళ్ళీ రికార్డుల్లో నమోదు చేసి డబ్బులు కాజేశారని  ఆరోపించారు. 
 
కలెక్టర్ భాస్కర్ రూ. 48 వేల కోట్లకు పోలవరం అంచనాలను చంద్రబాబు హయాంలో పెంచేశారని గుర్తు చేస్తూ ఇప్పుడు మళ్ళీ అదే అధికారిని వైసీపీ ప్రభుత్వం నియమించుకుందని ధ్వజమెత్తారు.  
విజయవాడలో రూ 10 కోట్లతో గత ప్రభుత్వం గెస్ట్ హౌస్  కట్టగా, ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకుందని దుయ్యబట్టారు. పోలవరం అవినీతిపై జగన్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్ట్‌కు కేంద్రం పూర్తి స్థాయిలో నిధులు ఇస్తుందని, పోలవరం ప్రాజెక్టు కట్టితీరుతామని భరోసా ఇచ్చారు.
టిడ్కో గృహాలు 60 వేలు మాత్రం పూర్తయ్యాయని చెబుతూ సీపీఐ నాయకుడు టిడ్కో ఇళ్ళు ఇచ్చేస్తామంటున్నారని విస్మయం వ్యక్తం చేశారు. ఇళ్ళు ఇవ్వటానికి సీపీఐ నాయకుడు ఎవరని ప్రశ్నించారు.
జగన్ వచ్చిన తర్వాత ఒక్క ఇళ్ళు కూడా కట్టలేదని విమర్శించారు. జగన్ 30 లక్షలు ఇళ్ల పట్టాలు ఇస్తానంటున్నారని చెబుతూ ఇళ్ళు పట్టాల్లో అవినీతి జరిగిందని మండిపడ్డారు. మునిగిపోయే భూములు ఇళ్ళు స్థలాలుగా పంపిణీ చేస్తారా..? అంటూ ప్రశ్నించారు.  రాజమండ్రి ఆవ భూములు కొనగోలులో రూ 150 కోట్లు అవినీతి జరిగిందని ధ్వజమెత్తారు.
టీటీడీ బడ్జెట్ ఏడాదికి రూ 1200 కోట్లు ఉన్నదని అంటూ అందులో హిందుత్వం కోసం రూ. 500 కోట్లు ఖర్చు పెట్టాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రజలు డబ్బులతో చర్చీలు నిర్మిస్తున్నారని, జగన్ ప్రతీ జిల్లాలో రూ. 15 కోట్లతో చర్చిలు నిర్మిస్తున్నారని విమర్శించారు.
పిఠాపురంలో పనికిరాని భూములు కలెక్టర్ కొనుగోలు చేస్తున్నారని పేర్కొంటూ తూర్పుగోదావరి జిల్లాలో అవినీతి డబ్బులు ఎక్కడకి వెళుతున్నాయని ప్రశ్నించారు. పోలవరం, టీటీడీ, ఇళ్ళు, ఇళ్ళు స్థలాల కొనుగోలులో అవినీతి జరిగిందని స్పష్టం చేశారు.