బోంబే హైకోర్టును ఆశ్రయించిన అర్నాబ్

రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి ఇవాళ బోంబే హైకోర్టును ఆశ్రయించారు. 2018నాటి ఓ ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్య కేసులో తనను ‘‘అక్రమంగా’’ అరెస్టు చేశారనీ,మహారాష్ట్రలోని అలీబాగ్ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని ఆయన అభ్యర్థించారు. 
 
ఈ పిటిషన్‌పై గురువారం మధ్యాహ్నం జస్టిస్ ఎస్ఎస్ షిండే, ఎంఎస్ కర్ణిక్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి, రేపటికి వాయిదా వేసింది.  ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారన్న ఆరోపణలపై ముంబై పోలీసులు బుధవారం తెల్లవారుజామున అర్నాబ్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 
 
ముంబైలోని లోవర్ పారెల్‌లోని అర్నాబ్ నివాసంలో ఆయనను అదుపులోకి తీసుకుని రాయ్‌గఢ్ జిల్లా అలీబాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిన్న సాయంత్రం ఆయనను మేజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టగా, కోర్టు ఈ నెల 18 వరకు అర్నాబ్‌కు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. 
 
ప్రస్తుతం ఆయన అలీబాగ్ జైలు కోసం ఏర్పాటు చేసిన ఓ కొవిడ్ కేంద్రంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తన ‘‘అక్రమ అరెస్టును’’ సవాల్ చేస్తూ అర్నాబ్ హైకోర్టును ఆశ్రయించారు. తక్షణమే విచారణపై స్టే విధించి, తనను విడుదల చేసేలా పోలీసులను ఆదేశించాలని ఆయన విన్నవించారు. 
 
తనపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని కూడా ధర్మాసనాన్ని కోరారు. అరెస్టు సందర్భంగా పోలీసులు అర్నాబ్ ఇంట్లోకి చొరబడి ఆయనపై వేధింపులకు పాల్పడ్డారంటూ ఆ  పిటిషన్‌లో ఆరోపించారు.   
మరోవంక, గోస్వామి అరెస్ట్ కు కారణమైన 2018లో ఆత్మహత్యకు పాల్పడిన అన్వయ నాయక్ కుమార్తె ఆదన్య నాయక్ కూడా హైకోర్టు ను ఆశ్రయించింది. తండ్రి ఆత్మహత్య నోట్ లో అర్ణబ్ గోస్వామితో పాటు మరో ఇద్దరి పేర్లను పేర్కొన్న విషయాన్నీ కోర్ట్ దృష్టికి ఆమె తీసుకు వచ్చారు. అయితే ఈ నోట్ కు సాక్ష్యాధారాలు లేవని అంటూ గత ఏడాదిలో ముంబై పోలీసులు కొట్టిపారవేసారు.