నేడే అమెరికా అధ్యక్ష ఎన్నికల సంగ్రామం 

మరి కొన్ని గంటల్లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలపై సర్వత్రా ఆసక్తితో పాటు ఉత్కంఠ నెలకొంది. అమెరికా ఫస్ట్‌ అనే నినాదంతో గత అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన డొనాల్డ్‌ ట్రంప్ మరోసారి గద్దెనెక్కాలని భావిస్తుంటే..డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి, మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్‌ తొలిసారి పదవిని చేపట్టేందుకు ఊవిళ్లూరుతున్నారు. 

ఇప్పటికి పలు సర్వేల్లో జో బిడెన్‌దే పైచేయిగా కనిపిస్తున్నా..కొన్ని చేదు అనుభవాల రీత్యా గెలుపెవరిదో అప్పుడే అంచనా వేయలేని పరిస్థితి. గత పర్యాయం కూడా ఫలితాలు  ఫలితాలు వెలువడే వరకు ట్రంప్ ఎన్నికను ఎవ్వరు అంచనా వేయలేక పోవడం గమనార్హం.  కరోనా నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికలు కాబట్టి..మరింత ప్రతిష్టాత్మకంగా మారాయి. 

ఈ నేపథ్యంలో పోస్టల్‌, ముందస్తు బ్యాలెట్లకు అనుమతి లభించడంతో..ఆ రూపంలో ఇప్పటికే ఓట్లు పోలయ్యాయి. ఈ లెక్క ప్రకారం ఇప్పటికే సగం ఓట్లు పోలయ్యాయని తెలుస్తున్నది. . ప్రస్తుతం కరోనా..ఆర్థిక వ్యవస్థ గాడిన పెట్టడం, ప్రపంచదేశాలపై తమ ఆధిపత్యాన్ని కొనసాగించడం వంటి సవాళ్లను అధిగమించాల్సిన సత్తా కల్గిన నేతను ఎన్నుకోవడం ప్రధాన అంశాలుగా మారాయి. 

కాగా, అమెరికా ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే కొన్ని రాష్ట్రాలపై నేతలతో సహా అందరీ దృష్టి ఉంది. అందుకే ఆయా రాష్ట్రాలో సోమవారం అర్థరాత్రి వరకు అలుపెరగకుండా ట్రంప్‌, బిడెన్‌లు పర్యటనలు చేసుకుంటూ వచ్చారు. బిడెన్‌ అయితే మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాను వెంటేసుకుని ఎన్నికల ప్రచార ర్యాలీల్లో పాల్గన్నారు. 

ముఖ్యంగా మిషిగాన్‌లో ఓటర్లను డెమొక్రటిక్‌ల వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. గత వైభవం కోసం పాట్లు పడుతున్నారు. మరోవైపు ట్రంప్‌ పెన్సిల్వేనియా..మిషిగాన్‌, ఫ్లోరిడా, జార్జియాలను చుట్టి వచ్చారు. కొన్ని రాష్ట్రాల్లో అయితే ప్రజలు తటస్థ వైఖరిని ప్రదర్శించడం వల్ల.ఎటు వైపు ప్రజలు మొగ్గుచూపుతున్నారో ఆ రెండు పార్టీల అభ్యర్థులకు తెలుసుకోవడం కష్టతరంగా మారింది. 

కీలక రాష్ట్రాల్లో ట్రంప్‌ కన్నా బిడెన్‌ ముందజంలో ఉన్నాడని సర్వేలు చెబుతున్నాయి. విజయం మాదే అంటే మాదే అని ఇరు పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తుది ఫలితాలు ఎప్పుడు వెలువడినా.. ఎన్నికైన అధ్యక్షుడు జనవరి 20నే పదవిని స్వీకరిస్తారు.

ముఖ్యంగా తక్కువ ఆదాయం గల స్వేతజాతీయులు ట్రంప్ వైపు మొగ్గు  చూపుతుంటే,విద్యావంతులు, ఆఫ్రికన్ అమెరికన్లు బిడెన్ కు మద్దతుగా ఉంటున్నారు. నల్ల జాతీయుల నుండి ట్రంప్ తీవ్రమైన సవాల్ ఎదుర్కొంటున్నారు. ట్రంప్ ను జాత్యంహకారి అని బిడెన్ మండిపడగా, బిడెన్ గెలుపొందితే కమ్యూనిస్ట్ దేశంగా మారుతుందని ట్రంప్ హెచ్చరిస్తున్నారు.

బిడెన్ ప్రెకషక పాత్ర వహిస్తుంటే వివాదాస్పదమైన ఉపాధ్యక్ష అభ్యర్థిని కమల్ హారిస్ అసలు అధికారం చెలాయిస్తుంటారని ట్రంప్ విమర్శలు కురిపిస్తున్నారు. కరోనా మహమ్మారి చరిత్రలో ఎరుగని ముప్పును అమెరికాకు తీసుకు వచ్చింది. సుమారు కోటి మంది కరోనా మహమ్మారికి గురికాగా,  2.30 లక్షల మంది వరకు ప్రజలు మృత్యువాత పడ్డారు.

అంతర్జాతీయ వ్యవహారాలలో వహిస్తున్న ఆధిపత్య ధోరణుల నుండి అమెరికా ట్రంప్ సారధ్యంలో నెమ్మదిగా వైదొలుగుతూ అమెరికా ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా చైనాను కట్టడి చేసే నినాదంతో అంతర్జాతీయ కూటమికి ట్రంప్ ఇచ్చిన పిలుపు ఈ ఎన్నికల ఫలితాలపై పడే అవకాశం ఉంది.