రాష్ట్రాలకు రూ.6 వేల కోట్ల రుణ సదుపాయం

దేశంలో 16 రాష్ట్రాలకు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలకు రెండో విడత జిఎస్‌టి పరిహారం కింద రూ.6 వేల కోట్ల ప్రత్యేక రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 
 
జిఎస్‌టి పరిహారం, సెస్‌ తగ్గుదల భర్తీకి రాష్ట్రాలకు ప్రత్యేక సదుపాయం” కింద 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలకు రెండో దఫాలో రూ.6 వేల కోట్లు కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఈ మొత్తాన్ని సగటున 4.42 శాతం వడ్డీతో కేంద్రం అప్పుగా తెచ్చింది. ఇదే వడ్డీ రేటుతో రాష్ట్రాలకు అందించింది. 
 
రాష్ట్రాలు ఇతర వనరుల నుంచి తెచ్చుకునే అప్పులపై వడ్డీ కన్నా ఇదే తక్కువని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ప్రత్యేక రుణ సదుపాయం కింద, రెండో విడతతో కలిపి మొత్తం రూ.12 వేల కోట్లును కేంద్ర ఆర్థిక శాఖ అప్పుగా రాష్ట్రాలకు అందజేసింది. ఇప్పటివరకు 21 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలు, ఆప్షన్‌-1 కింద ప్రత్యేక రుణ సదుపాయాన్ని ఎంచుకున్నాయి. 
 
రుణ మొత్తాన్ని కేంద్రం పలుదఫాలుగా అందజేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌, అస్సాం, బీహార్‌, గోవా, గుజరాత్‌, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, మేఘాలయా, ఒరిస్సా, తమిళనాడు, త్రిపుర, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌తోపాటు, కేంద్ర పాలిత ప్రాంతాలైన ఢిల్లీ, జమ్మూకాశ్మీర్‌, పుదుచ్చేరి కేంద్రం నుంచి రుణాలు పొందాయి.