వరద సాయంకోసం ఎక్కడికక్కడ ఆందోళనలు 

 
హైదరాబాద్ నగరాన్ని గతంలో ఎన్నడూ ఎరుగని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తి పక్షం రోజులు గడచినా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రకటించిన ఒకొక్కరికి రూ 10,000 ఆర్ధిక సహాయం ఇంకా అందాకా పోవడంతో బాధిత ప్రజలు ఎక్కడికక్కడ ఆందోళనలకు దిగుతున్నారు. 

జీహెచ్​ఎంసీ ఆఫీసు ఎదుట, రోడ్లపై కూర్చొని అధికారులు, టీఆర్​ఎస్​ నేతలపై మండిపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బస్తీలకు ఎలా వస్తారో చూస్తామని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   ఉన్నోళ్లకే డబ్బులు పంచి గరీబోళ్లను వదిలేశారని ఆరోపిస్తున్నారు.  రోజురోజుకు బాధితుల ఆందోళనలు మరింత ఎక్కువవుతుండడంతో సర్కార్​ దిగొచ్చింది.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేష్​కుమార్​ ఆదివారం బల్దియా కమిషనర్​తో సమీక్షా సమావేశం నిర్వహించారు. వరద బాధితుల ఇంటి వద్దకే వెళ్లి సాయం అందించాలని నిర్ణయించారు. బాధితులను గుర్తించడంలో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని ఆదేశించారు. సోమవారం నుంచి తిరిగి బాధితులకు రూ.10వేల ఆర్థిక సాయం పంపిణీచేస్తున్నట్లు ప్రకటించారు. 

రెండు వారాలుగా  వరద సాయం అందజేస్తుండగా ఇప్పటివరకు 3.87 లక్షల  కుటుంబాలకు రూ.387.90కోట్లు అందించారు. ఇంకా 2 లక్షల మంది ఉన్నట్లు జీహెచ్​ఎంసీ అధికారులు అంచనా వేసినా, అంతకు రెట్టింపుగానే ఉన్నారు.   తక్షణసాయం కింద ప్రభుత్వం రూ.550కోట్లు విడుదల ​చేసింది. 

బాధితుల సంఖ్య ఎక్కువగా ఉండటం, ఇప్పటికే అనర్హుల చేతికి డబ్బులు పోవడంతో ఈ నిధులు సరేపోయేలా లేవు. అనర్హులకు సాయం అందడంతో అర్హులైన బాధితులు  రోడ్డెక్కారు. నిజమైన వరద బాధితులకు ఆర్థిక సహాయం అందలేదని ముషీరాబాద్ నియోజకవర్గం బీజేపీ జాయింట్ కన్వీనర్ ఎం. నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో  పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.  

బాపూజినగర్ ,భరత్ నగర్, మోరాంబోండా, జాంభవినగర్ , మోహన్​ నగర్ తదితర ప్రాంతాల బాధితులు ర్యాలీగా వచ్చి జీహెచ్​ఎంసీ వార్డు ఆఫీస్​ వద్ద ధర్నాకు దిగారు. సాయం అందలేదని మహిళలు ఆధార్ కార్డులను ప్రదర్శిస్తూ  కార్పొరేటర్​, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిజమైన వరద ముంపు బాధితులకు ఆర్థిక సాయం అందలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.  టీఆర్ఎస్​ కార్యకర్తలకు మాత్రమే సాయం అందించారని మండిపడ్డారు.