శేరిలింగంపల్లిలో బీజేపీ నేత యోగానంద్ పాదయాత్ర  

ప్రజాసమస్యలను ప్రభుత్వ దృష్టికి తెచ్చి, మొద్దు నిద్ర నుంచి కేసీఆర్ సర్కారును నిద్ర లేపుతామంటూ శేరిలింగంపల్లి నియోజక వర్గం బీజేపీ ఇంచార్జి యోగానంద్ పాదయాత్రను ప్రారంభించనున్నారు. శేరిలింగంపల్లి నియోజక వర్గంలోని అన్ని డివిజన్లలో ఈ యాత్ర విడతల వారీగా సాగనుంది. 

మొదట లింగంపల్లి డివిజన్‌లో ఈ యాత్రను జిల్లా అధ్యక్షులు రంగారెడ్డి ప్రారంభిస్తారు. పార్టీ నాయకులు, కార్యకర్తలూ ఈ యాత్రలో పాల్గొంటారని చెప్పారు. ప్రజలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా యోగానంద్ విజ్ఞప్తి చేశారు.

పాదయాత్ర కరపత్రాన్ని విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజక వర్గంలో ప్రజాసమస్యల పరిష్కారంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదని విమర్శించారు. 

శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కూడా ఇవ్వలేదని చెబుతూ చెరువులు కూడా కబ్జా అవుతున్నాయని ఆరోపించారు. అధికార పార్టీ నాయకుల కనుసన్నలలోనే కబ్జాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు.

ప్రభుత్వ స్థలాలు కూడా కబ్జా అవుతున్నా పట్టించుకునే నాథుడే లేడని యోగానంద్ విమర్శించారు. రోడ్లు పాడైపోయి గుంతలుపడ్డాయని, మ్యాన్ హోల్స్ ఎక్కడికక్కడ తెరుచుకుని ఉన్నాయని విచారం వ్యక్తం చేశారు. వర్షం వస్తే బస్తీలన్నీ జలమయం అయ్యాయని, పేదలకు నీడ కరువైందని చెప్పారు. నియోజకవర్గంలోని ప్రజలకు వైద్యం లేదని, సర్కారు విద్య అందడమే లేదని దుయ్యబట్టారు.