ఆర్టికల్‌ 370 పునరుద్ధరించే ప్రసక్తి లేదు 

జమ్ముకాశ్మీర్‌ ప్రత్యేక హోదాకు సంబంధించిన ఆర్టికల్‌ 370 పునరుద్ధరించే ప్రసక్తి లేదని న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌  ప్రసాద్ స్పష్టం చేశారు. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. జమ్ముకాశ్మీర్‌లో ఆరు పార్టీలతో పీపుల్స్‌ అలయన్స్‌ ఫర్‌ గుప్కర్‌ డిక్లరేషన్‌ (పిఎజిడి) ఏర్పడిన సంగతి తెలిసిందే. 
 
తమ రాష్ట్ర జెండాను తిరిగి తీసుకువస్తామనిమెహబూబా ముఫ్తీ చేసిన వ్యాఖ్యలు జాతీయజెండాను అవమానించడమేనని రవిశంకర్‌ విమర్శించారు. రాజ్యాంగ ప్రక్రియను అనుసరించి గతేడాది ఆర్టికల్‌ 370ని రద్దు చేశామని, పార్లమెంటు ఉభయ సభలు అధిక సంఖ్యలో ఆమోదం తెలిపాయని ఆయన గుర్తు చేశారు. 
 
పిఎజిడినుద్దేశించి మాట్లాడుతూ.. జాతీయ జెండాను అగౌరవపరిచిన ముఫ్తీ వ్యాఖ్యలపై మిగిలిన పార్టీలు మౌనం వహించాయని, బిజెపి విధానాలను విమర్శించాయని ధ్వజమెత్తారు. వారిది వంచన, ద్వంద్వ వైఖరని రవిశంకర్‌ ప్రసాద్‌ మండిపడ్డారు.