ముఫ్తీ వాఖ్యలు దేశ ద్రోహం… అరెస్ట్ చేయండి 

తమ రాష్ట్రం జెండా తిరిగి వస్తేనే తాము జాతీయ జెండాను ఎగరేస్తామన్న మాజీ ముఖ్యమంత్రి,  పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ అధినేత్రి  మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. ఆ వాఖ్యలు దేశద్రోహం అని ధ్వజమెత్తింది. 

” ఇది నా జెండా. దీన్ని వెనక్కు ఇచ్చిన అనంతరమే మేము మూడు రంగుల జాతీయ జెండాను ఎగురవేస్తామని, ఈ జెండా కారణంగానే తాము దేశంలోని ఇతర ప్రాంతాలతో సంబంధాలను కలిగి ఉన్నాము” అని శుక్రవారం మీడియా సమావేశంలో రాష్ట్ర జెండానుద్దేశించి ముఫ్తీ వ్యాఖ్యానించారు. 

ఈ వ్యాఖ్యలపై జమ్ముకాశ్మీర్‌ బిజెపి అధ్యక్షుడు రవీందర్‌ రైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మెహబూబా ముఫ్తీ చేసిన వ్యాఖ్యలను గమనించాలని, ఆమెపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌సిన్హాను కోరారు. ఆమెను దేశద్రోహ చట్టం కింద అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. 

మన జాతీయ జెండా, దేశం, మాతృభూమి కోసం త్యాగం చేశామని, అటువంటి దేశమైన జమ్ముకాశ్మీర్‌లో జాతీయ జెండాను మాత్రమే ఎగురవేయాలని ఆయన స్పష్టం చేశారు. 

కాశ్మీర్‌ ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయవద్దని ముఫ్తీతో సహా ఇతర నాయకులను హెచ్చరిస్తున్నానని ఆయన చెప్పారు. శాంతి, సోదరభావం, సమానత్వానికి భంగం కలిగించేందుకు ఎవరినీ అనుమతించమని, ఎనైనా తప్పు జరిగితే పర్యవసానాలను ముఫ్తీ ఎదుర్కోవలసి వుంటుందని రవీందర్‌ రైనా హెచ్చరించారు.