అమెరికాలో తెలుగులో బ్యాలట్ పేపర్ 

నవంబర్ 3న జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలలో తెలుగులో కూడా బ్యాలట్ పేపర్లు ఉండటం ఆ దేశంలోని ప్రవాస ఆంధ్రులు సంబరపడుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అమెరికాలో ప్రజలకు సమాచారం అందించేందుకు అధికారిక భాషగా తెలుగు భాషను గుర్తించడంతో ఇది సాధ్యమయింది. 

ఈ ఎన్నికల్లో ఓటరు బ్యాలెట్ పేపర్ వివిధ భాషల్లో ముద్రిస్తారు. ఈ నేపథ్యంలో హిందీ సహా కొన్ని భారతీయ భాషలతో పాటు ఓటరు బ్యాలెట్ పేపర్‌లోని అధికారిక భాషల జాబితాలో తెలుగు భాష కూడా చేర్చారు.

దీనితో ఎన్నికల ప్రక్రియతోపాటు అమెరికాలో జరిగే అన్ని అధికారిక కార్యకలాపాల్లో ఇక మీదట విషయాన్ని తెలుగులో వివరించనున్నారు. తెలుగు మాట్లాడేవారికి కూడా ఇప్పటివరకు ఉన్నదానికి అదనంగా మరింత ప్రత్యేక గుర్తింపు లభించనున్నది.

ప్రాచీన భాషల్లో తెలుగు ఒకటి. అయితే, తెలుగును ప్రాచీన భాషగా గుర్తించడానికి చాలా సమయం పట్టింది. అయినప్పటికీ తెలుగు ప్రజలు తమ మాతృభాషను కాపాడుకుంటూ ప్రపంచమంతా విస్తరించారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడేవారు 15 కోట్ల దాకా ఉంటారని ఒక అంచనా.

2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో దాదాపు 9 కోట్ల మంది  తెలుగు మాట్లాడేవారు ఉన్నారు. వారిలో అత్యధికులు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నారు. ఈ 9 ఏండ్లలో ఈ సంఖ్య విపరీతంగా పెరిగింది. భారతదేశంలో ప్రాచీన భాషలుగా తెలుగుతో పాటు ఆరు భాషలకు మాత్రమే గుర్తింపు ఉంది. 

అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. చాలా మంది తెలుగువారు ఉన్నత చదువులు, పరిశోధనల నిమిత్తం అమెరికా వెళ్లి స్థిరపడుతున్నారు. అందుకే అక్కడి ప్రభుత్వం తెలుగును వ్యవహారిక భాషగా గుర్తించక తప్పలేదని నిపుణులు భావిస్తున్నారు.