లవ్‌ జిహాద్‌ వివాహాలపై అస్సోంలో ప్రత్యేక చట్టం!

హిందు యువతులను మోసం చేసి వివాహం చేసుకుంటున్న ముస్లిం యువకులపై కఠిన చర్యలకు తీసుకోవాలని నిర్ణయించింది. దీని కోసం ప్రత్యేకంగా ఓ చట్టాన్ని రూపొందిస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి హేమంత్‌ బిశ్వాశర్మ వెల్లడించారు.

లవ్‌ జిహాద్‌కు వ్యతిరేకంగా అస్సోం ప్రభుత్వం పోరాటాన్ని ప్రారంభించబోతుందని మంత్రి ప్రకటించారు. తమ బిడ్డలను మోసగాళ్ల వంచన నుంచి రక్షించేందుకే ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. 

‘’సోషల్‌ మీడియా వాడకం విచ్చలవిడిగా పెరిగినే నేపథ్యంలో చాలామంది అమాయక బాలికలు మోసపోతున్నారు. హిందు అమ్మాయిలను వివాహం చేసుకోవాలనే దుర్భుద్దితో కొంతమంది ముస్లిం యువకులు కుట్రలకు పాల్పడుతున్నారు. సోషల్‌ మీడియాలో హిందు వ్యక్తి మాదిరిగా ఫేక్‌ ఎకౌంట్‌ సృష్టించి దానికి ఓ దేవుడి ఫోటోను వాల్‌పేపర్‌గా పెడుతున్నారు” అని మంత్రి పేర్కొన్నారు.

ఈ విధంగా హిందు వర్గానికి చెందిన యువతులను మోసం చేసి, ప్రేమ పేరుతో లోబర్చుకుంటున్నారని ధ్వజమెత్తారు. అనంతరం పెద్దలకు ఇష్టం లేకున్నా దొంగచాటుగా వివాహం చేసుకుంటున్నారని చెబుతూ ఇలా ఎంతో మంది యువతులు వారి చేతిలో మోసపోతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు లవ్‌ జిహాద్‌ పేరుతో తమ బిడ్డలను మరో వర్గం వారు బలవంతంగా వివాహం చేసుకుంటున్నారు. అన్నెంపున్నెం ఎరుగని యువతుల్ని మభ్యపెట్టి బలవంతంగా మత మార్పిడి చేసి.. తమ మతంలోకి మార్చుకుంటున్నారు. దీనిని ఇక సహించేది లేదని మంత్రి స్పష్టం చేశారు.

బలవంతపు వివాహాలను నివారించడానికి చర్యలకు ఉపక్రమిస్తున్నామని చెబుతూ  అస్సామీ ఆడపడచుల రక్షణకే ఈ నిర్ణయం తీసుకున్నామని   బిశ్వాశర్మ  తెలిపారు. 

ఇటీవల కాలంలో మతమార్పిడి సంఘటలను తరచుగా వెలుగుచూస్తున్నాయి. తమ ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకున్నట్లు యువతులు చెబుతున్నా ఇది బలవంతపు వివాహమని తల్లిదండ్రులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు.

ఈ నేపథ్యంలో మేలుకున్న అస్సోం ప్రభుత్వం ఇకపై బలవంతపు వివాహాలను చోటుచేసుకోకుండా ఉండేందుకు తగిన చర్యలకు చేపట్టాలని నిర్ణయించింది. 

గత ఆగష్టులో `లవ్ జిహాదీ’ని ప్రోత్సహిస్తూ ప్రసారం చేస్తున్న ఒక అస్సామీ టివి ఛానల్ లోని సీరియల్ ను అధికారులు నిరసన ఆందోళనల నేపథ్యంలో నిషేధించారు.