భారత్ లో ఉగ్రదాడులు పాక్ భారీ కుట్ర   

భారత్‌లో పెద్దఎత్తున ఉగ్రదాడులకు పాకిస్థాన్ ఇంటెలిజెన్స్, ఉగ్రమూకలు పథకం రచించినట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. దాడులకు ప్రణాళికలు రచించేందుకు పాక్​ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)​లో ఐఎస్ఐ, ఉగ్ర సంస్థల కీలక నేతలు ఈ నెల 4, 7వ తేదీల్లో రెండుసార్లు సమావేశమైనట్లు వెల్లడించాయి. 

సమావేశంలో ఉగ్రవాద సంస్థల నేతలు సయ్యద్ సలావుద్దీన్, హఫీజ్ సయీద్, అన్ని లాంచ్ ప్యాడ్ల కమాండర్లతోపాటు వివిధ మిలిటెంట్ టాంజిమోస్ ఉన్నట్లు నివేదించాయి. ఇంటెలిజెన్స్‌ నివేదిక ప్రకారం ఒక్కొక్క దాడికి రూ.26లక్షలు, పెద్ద ఆపరేషన్‌కు రూ. 30లక్షల వరకు ఇచ్చినట్లు సమాచారం. 

ఎల్‌ఓసీ సమీపంలోని లాంచ్ ప్యాడ్‌లలో బోర్డర్ యాక్షన్ టీం (బాట్) చురుకుగా ఉందని భద్రతా సంస్థలు తెలిపాయి. పాకిస్థాన్​ సైన్యం, బాట్​దళాల సమక్షంలో చొరబాటుకు ప్రణాళికలు చేసినట్లు తెలుస్తోంది. 

హిండి వద్ద నౌషేరా క్యాంపు  సమీపంలో 35 మంది ఉగ్రవాదుల బృందం చొరబాటుకు సిద్ధంగా ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. సుజియాన్‌ ప్రాంతంలోని పాక్‌ గ్రామాల్లో ఉగ్రమూకల కదలికలు ఉన్నట్లు నిఘావర్గాలు గుర్తించారు.