ఒక్క అంగుళం భూమిని భారత్ చైనాకు ఇవ్వదు  

‘‘ఒక్క అంగుళం భూమిని కూడా భారత్ ఎప్పటికీ చైనాకు ఇవ్వదు. మన సార్వభౌమత్వాన్ని, సరిహద్దులను రక్షించే సామర్థ్యం మన జవాన్లకు, రాజకీయ నాయకత్వానికి పుష్కలంగా ఉంది” అని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.   ఎలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తినా, స్పందించేందుకు భారత సైన్యం ఎల్లప్పుడూ సర్వ సన్నద్ధంగా ఉంటుందని ప్రకటించారు.

యుద్ధానికి సిద్ధం కావాలంటూ చైనా అధ్యక్షుడు జింగ్‌పింగ్ చైనా బలగాలకు సూచించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యుద్ధానికి ఏ దేశమైనా ఎప్పటికీ రెడిగానే ఉంటుందని, ఎలాంటి విపత్తు వచ్చినా… దీటుగా ప్రతిస్పందించాలన్న ఉద్దేశంతోనే ఏ దేశమైనా సైన్యాన్ని నిర్వహిస్తుందని గుర్తు చేశారు.

“అయితే నేను ఈ వ్యాఖ్యలను ఎవర్నీ దృష్టిలో పెట్టుకునే మాట్లాడటం లేదు. కానీ… భారత సైన్యం మాత్రం ఎప్పటికీ రెడీగానే ఉంటుందని మాత్రం చెప్పగలను’’ అని షా ప్రకటించారు. రెండు దేశాల మధ్య సైనిక  అధికారి స్థాయి చర్చలు జరుగుతూనే ఉన్నాయని, దౌత్య మార్గాలు కూడా తెరిచే ఉన్నాయని పేర్కొన్నారు. 

అయినా ఓ హోంమంత్రిగా ఈ విషయమై తాను  స్పందించాల్సిన అవసరం లేదని చెప్పారు. దేశం చాలా జాగరూకతతో ఉందని, ఒక్క అంగుళం భూమిని కూడా ఎవరూ ఆక్రమించుకోలేరన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఉంటంకిస్తున్నట్లు షా తెలిపారు. 

ఇలా ఉండగా, ఎన్నికల తరువాత బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినా బీహార్ లో నితీశ్ కుమారే తదుపరి ముఖ్యమంత్రిగా ఉంటారని అమిత్‌షా ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో 2/3 వంతు సీట్లను ఎన్డీయే గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ‘‘ఒకవేళ…. కానీ…. ఇలా సందిగ్ధం లేదు. నితీశ్ కుమారే తదుపరి సీఎం.  ఇప్పటికే ప్రకటించాం. దానికే కట్టుబడి ఉంటాం.’’ అని షా స్పష్టం చేశారు.

గౌరవ ప్రదమైన సీట్లనే తాము ఎల్జేపీకి కేటాయిస్తామని చెప్పామని, అయినా ఎన్డీయే వీడి చిరాగ్ వెళ్లిపోయారని, అది ఎంత మాత్రం తమ తప్పు కాదని తేల్చి చెప్పారు. ఎన్డీయే కూటమి నుంచి బయటికి వెళ్లాలన్న నిర్ణయం చిరాగే తీసుకున్నారని, తమ నిర్ణయం కాదని షా తెలిపారు.