విపత్తు ప్రభావిత దేశాల్లో మూడోస్థానంలో భారత్ 

వరుస విపత్తులతో ప్రపంచం ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. గత రెండు దశాబ్దాల్లో సంభవించిన ప్రకృతి విపత్తుల్లో భారత్‌ (విపత్తులు 321) మూడో స్థానంలో ఉండగా.. అమెరికా (577), చైనా (467) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. 
 
ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఈ నివేదిక ప్రకారం.. గత రెండు దశాబ్దాల్లో ఉపద్రవాలు రెట్టింపు అయ్యాయి.
 
 విపత్తుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా గత 20 ఏండ్లలో సగటున ఏడాదికి 60,000 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 400 కోట్ల మంది ప్రభావితమయ్యారు. అత్యధికంగా ఆసియాలో 3,068 విపత్తులు నమోదుకాగా, అమెరికాలో 1,756, ఆఫ్రికాలో 1,192 విపత్తులు నమోదయ్యాయి.
 
 ఇలా ఉండగా, లా నినా పరిస్థితుల కారణంగా ఈ శీతాకాలంలో చలి అధికంగా ఉండనుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర తెలిపారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎమ్‌ఏ) నిర్వహించిన వెబినార్‌లో ఆయన మాట్లాడారు. 
 
‘బలహీన లా నినా పరిస్థితులు ఉన్నందున ఈ ఏడాది చలి ఎక్కువగా ఉండనుంది. చలిగాలులపై లానినా, ఎల్‌నినో తీవ్ర ప్రభావం చూపుతాయి. లా నినా పరిస్థితులు చలిగాలులకు అనుకూలం కాగా, ఎల్‌నినో పరిస్థితులు అందుకు ప్రతికూలం’ అని ఆయన వివరించారు. చలిగాలుల కారణంగా రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌లలో అత్యధిక మరణాలు సంభవిస్తుంటాయని చెప్పారు.