కరొనపై ఐదు రాష్ట్రాలకు కేంద్ర బృందాలు 

కరోనాను ఎదుర్కోవడంలో సహాయపడేందుకు ఐదు రాష్ట్రాలకు కేంద్ర బృందాలను పంపనున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ బృందాలు పర్యటించనున్న ప్రాంతాల్లో కర్ణాటక, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమ బెంగాల్‌, కేరళ ఉన్నాయి.

కరోనా నియంత్రణ, నిఘా, పరీక్ష, సంక్రమణ నివారణ, సమర్థవంతమైన క్లినికల్‌ మేనేజ్‌మెంట్‌ను బలోపేతం చేయడానికి ఈ బృందాలు సహాయపడతాయి. 

ప్రతి బృందంలో ఒక సంయుక్త కార్యదర్శి (సంబంధిత రాష్ట్రానికి నోడల్‌ ఆఫీసర్‌), ప్రజారోగ్య అంశాలను చూసుకోవటానికి ఒక ప్రజారోగ్య నిపుణుడు, సంక్రమణ నివారణ పద్ధతులను, క్లినికల్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోటోకాల్‌ను రాష్ట్రం అనుసరిస్తోందా అనేది పరిశీలించేందుకు ఒక వైద్యుడు సభ్యులుగా ఉంటారు.

గత 24 గంటల్లో 63,371 కరోనా పాజిటివ్‌ కేసులు, 895 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 73,70,469కి, మరణాల సంఖ్య 1,12,161కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. 8,04,528 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

రికవరీ రేటు 87.56 శాతం, మరణాల రేటు 1.52 శాతంగా ఉంది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇటీవల బీహార్‌కు చెందిన బిజెపి నేత, రాష్ట్ర మంత్రి వినోద్‌ కుమార్‌ సింగ్‌ కరోనాతో మృతి చెందారు. రాష్ట్ర జనతాదళ్‌ (యు) సీనియర్‌ నాయకుడు, రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కపిల్‌ దియో కామత్‌ (69) కరోనాతో శుక్రవారం కన్నుమూశారు.