బిజెపి అభ్యర్థిగా ఒలింపిక్‌ పతాక విజేత యోగేశ్వర్  

హర్యానాలోని బరోడా అసెంబ్లీ నియోజక వర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఒలింపిక్‌ పతాక విజేత యోగేశ్వర్‌ దత్తాను తమ అభ్యర్థిగా బిజెపి ప్రకటించింది. సోనిపట్‌లో బరోడా స్థానానికి వచ్చే నెల 3న జరగనున్న ఈ ఎన్నికల్లో రాజకీయ నేతగా మారిన మల్లయోధుడు యోగేశ్వర్‌ పోటీ చేయనున్నారని పార్టీ ప్రకటన విడుదల చేసింది.

శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేసేందుకు చివరి తేదీ కావడంతో ఈ ప్రకటన చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీ కృష్ణ హుడా చనిపోవడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుడా చేతిలో యోగేశ్వర్‌ ఓటమి చెందారు. ఇప్పుడు ఇదే స్థానం నుండి తిరిగి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.

ఇప్పటి వరకు ఈ స్థానంలో బిజెపి ఒక్కసారి కూడా గెలవలేదు.  అంతకముందు బిజెపి నేత బబితా పోగట్‌తో పాటు సాక్షి మాలిక్‌, గీతా పొగట్‌తో వంటి ప్రముఖ క్రీడాకారులు..ఢిల్లీలో ముఖ్యమంత్రి ఎంఎల్‌ ఖట్టర్‌ను కలిశారు. యోగేశ్వర్‌ను అభ్యర్థిగా పోటీ చేయించేందుకు ఈ క్రీడాకరులంతా ముఖ్యమంత్రిని కలిశారని సమాచారం.

అంతకమందు రాష్ట్ర పార్టీ విభాగం 25 పేర్లను పరిశీలించిందని, నలుగురు పేర్లను ఫైనల్‌ చేసి..అధిష్టానానికి పంపినట్లు ఖట్టర్‌ తెలిపారు. అంతలోనే యోగేశ్వర్‌ పేరును బిజెపి ప్రకటించింది.