ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలపై కరణ్ సింగ్ అభ్యతరం 

ఆర్టికల్ 370 పై కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు ఎంత మాత్రమూ సమర్థనీయం కావని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ దౌత్యవేత్త కరణ్ సింగ్ స్పష్టం చేశారు. 

‘‘ఆర్టికల్ 370 ని పునరుద్ధరణ విషయంలో నా పాత స్నేహితుడు ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కావు. వాస్తవం కాని అంచనాలను ప్రజల్లో రేకెత్తించేవారవుతారు’’ అంటూ కరణ్ సింగ్ హితవు చెప్పారు. 

‘‘ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ఆయన చికాకును నేను అర్థం చేసుకోగలను. ఓ సంవత్సరం పాటు ఆయన గృహ నిర్బంధంలో కూడా ఉన్నారు. అయినా సరే… ఆర్టికల్ 370 విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంత మాత్రం సమర్థనీయం కావు.’’ అని కరణ్ సింగ్ పేర్కొన్నారు. 

చైనా సహాయంతో జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 ని తిరిగి పునరుద్ధరిస్తామని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. 

ఆర్టికల్ 370 రద్దును అటు చైనా గానీ, ఇటు కశ్మీరీ ప్రజలు గానీ ఎన్నడూ అంగీకరించలేదని, గత ఒప్పందాలకు విరుద్ధంగా తొలగించారు కాబట్టే చైనా యుద్ధానికి దిగుతోందని అబ్దుల్లా పేర్కొన్నారు. ఆయన వాఖ్యల పట్ల బిజెపి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.