బీజేపీ ‘ఛలో అసెంబ్లీ’ తో ముందస్తు అరెస్టులు

టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ మేరకుతక్షణమే నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని, ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను దోపిడీ చేసేజీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని, ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాలకు చరమగీతం పాడాలని డిమాండ్ చేస్తూ బిజెపి హైదరాబాద్ చేపట్టిన ‘ఛలో అసెంబ్లీ’ విజయవంతమైంది. బిజెపి ఆందోళనలకు జడిసిన టీఆర్ఎస్ సర్కార్ పెద్దఎత్తున ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలకు తెగబడింది.

హైదరాబాద్ పరిధిలోని బిజెపి జిల్లాల శాఖలు ఆందోళనలకు పిలుపిస్తే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ఇతర జిల్లాల్లోనూ అరెస్టులు, గృహ నిర్బంధాలు చేపట్టారు. ఆందోళనలు చేపట్టిన బిజెపి నాయకులు, కార్యకర్తల పట్ల పలు చోట్ల లాఠీచార్జీకి పాల్పడ్డారు. 

ప్రజాస్వామిక హక్కయిన నిరసన కూడా తెలపనీయకుండా టీఆర్ఎస్ సర్కార్ అణిచివేత చర్యలకు పాల్పడడాన్ని బిజెపి తెలంగాణ తీవ్రంగా ఖండిస్తోంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావులో నెలకొన్న అభద్రతా భావానికి సంకేతమని భావిస్తోంది.

ఎన్నికల వేళ హామీలు గుప్పించి, గెలిచిన తర్వాత వాటిని మర్చిపోవడం టీఆర్ఎస్ సర్కార్ కు అలవాటుగా మారింది. గత జీహెచ్ఎమ్సీ ఎన్నికలప్పుడు పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తానని హామీ ఇచ్చి, హడావిడిగా శంకుస్థాపనలు చేసిన టీఆర్ఎస్ సర్కార్ ఇప్పటి వరకు వాటిని పూర్తి చేయలేదు. 

తెలంగాణలో 2 లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లని, జీహెచ్ఎమ్సీ పరిధిలో 1 లక్ష ఇండ్లు కట్టిస్తున్నామని చెప్పినా ఇప్పటివరకు 1000 ఇండ్లు కూడా లబ్ధిదారులకు అందజేయలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి అవాస్ యోజన కింద రాష్ట్రానికి 2.70వేల ఇండ్లు మంజూరు చేసిన వాటిని రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసులేకపోయింది. 

కేసీఆర్ సర్కార్ అసమర్థత వల్ల ఈ పథకం కింద వచ్చిన నిధులు కూడా వెనక్కి వెళ్లే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పేదలకు వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి ఇవ్వాలని బిజెపి డిమాండ్ చేసింది. 

కరోనా వేళ ప్రజల ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైన సమయంలో టీఆర్ఎస్ సర్కార్ ఎల్ఆర్ఎస్ పేరిట ప్రజలను దోచుకోవాలని చూడడం దారుణమని బిజెపి మండిపడింది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణలేమితో తలెత్తిన ఇబ్బందులనుఎదుర్కొనేందుకు ఎల్ఆర్ఎస్ పేరిట ప్రజలను భయపెట్టి వసూళ్ల పర్వానికి తెరతీసిందని బిజెపి విమర్శించింది. 

ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్న ఎల్ఆర్ఎస్ జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని బిజెపి డిమాండ్ చేసింది. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉంటే వాటి కోసం ఎప్పుడూ శాసనసభ ప్రత్యేక సమావేశాలు పెట్టని సీఎం కేసీఆర్ తమ ప్రభుత్వానికి కావాల్సిన బిల్లులను ఆమోదించుకునేందుకు  శాసనసభను నిర్వహించడాన్ని బిజెపి ఖండించింది. 

బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా. కె.లక్ష్మణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. జి. మనోహర్ రెడ్డితో పాటు పలువురిని గృహ నిర్బంధం చేశారు. అరెస్టయిన వారిలో మాజీ ఎమ్మెల్యే  చింతల రామచంద్రారెడ్డి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి గీతామూర్తి, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు  ఆలె భాస్కర్ ఉన్నారు.