ఏపీకి రూ.5,051 కోట్ల అదనపు రుణంకు అనుమతి 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌లో రూ.5,051 కోట్ల మేరకు అదనంగా రుణం సేకరించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. దేశంలో 20 రాష్ట్రాలు మొత్తం రూ.68,825 కోట్ల వరకు అదనపు రుణాలను సమకూర్చుకునేందుకు అనుమతించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ (వ్యయం) వెల్లడించింది. 

జీఎ్‌సటీ అమలు చేయడం వల్ల నెలకొన్న నష్టాలను భర్తీ చేయడానికి వీలుగా ఆర్థిక శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.  కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జీఎ్‌సడీపీ)లో 2 శాతం అదనపు రుణ సమీకరణ లక్ష్యంలో భాగంగా 0.50 శాతం అదనపు రుణాల సేకరణకు కేంద్రం తొలి విడతగా అనుమతించింది. 

గత ఆగస్టు 27న జరిగిన జీఎస్‌టీ కౌన్సిల్‌ భేటీలో వచ్చిన ప్రతిపాదనల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. మొదటి దశలో అదనపు రుణాల సేకరణకు అనుమతి పొందిన 20 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌  కూడా ఉంది. 

ఈ జాబితాలో తెలంగాణకు చోటు దక్కలేదు. మిగతా 8 రాష్ర్టాలు ఆప్షన్లను ఇంకా ఎంచుకునే ప్రక్రియలోనే ఉన్నాయి.