ఉద్యోగ నియామకాలకు 23 రాష్ట్రాల్లో ఇంటర్వ్యూలు రద్దు

ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూ విధానానికి 23 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు స్వస్టి పలికాయని కేంద్ర సిబ్బంది, శిక్షణశాఖ(డిఒపిటి) సహాయమంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. రాత పరీక్షల్లో అభ్యర్థులు కనబరిచిన ప్రతిభ ఆధారంగానే ఆయా రాష్ట్రాల్లో ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్టు ఆయన తెలిపారు. 
 
మొత్తం 8 కేంద్రపాలిత ప్రాంతాలతోపాటు మహారాష్ట్ర, గుజరాత్‌లాంటి రాష్ట్రాల్లో ఇంటర్వ్యూలను రద్దు చేశారు. 2016, జనవరి 1 నుంచి గ్రూప్ బి(నాన్ గెజిటెడ్), గ్రూప్ సి పోస్టులకు కేంద్ర ప్రభుత్వం ఇంటర్వ్యూలను రద్దు చేసింది. 
 
ఇంటర్వ్యూ కాల్ లెటర్లు వచ్చినపుడు రాత పరీక్షల ద్వారా ఎంపికైన కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ  2015 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తన ప్రసంగంలో పేర్నొన్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
ఇంటర్వ్యూలు నిర్వహించేవారు పారదర్శకంగా ఉండటం లేదని, కొందరి పట్ల సానుకూలతతో వ్యవహరిస్తున్నారన్న పలు ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు జితేంద్రసింగ్ తెలిపారు.