గ్రామాల్లో వీధి దీపాల నిర్వహణ ఇక నుంచి కేంద్రం చేతుల్లోకి వెళ్లనుంది. అన్ని ఊళ్లకు ఎల్ఈడీ లైట్లు సరఫరా చేయడంతో పాటు, నిర్వహణ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) నిర్వహించనుంది.
దీనివల్ల విద్యుత్ ఆదా కావడంతో పంచాయతీల భారం తగ్గనుంది. మున్సిపాలిటీల్లో వీధి దీపాల ఏర్పాటును గతంలోనే ఆ సంస్థ తన పరిధిలోకి తీసుకోగా, ప్రస్తుతం గ్రామాల బాధ్యత సైతం చేపట్టింది. గ్రామాల్లో వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణ బాధ్యత చూసేందుకు ఈఈఎస్ఎల్ సంస్థ ఈ నెల 7న తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖతో ఒప్పందం చేసుకుంది.
దీని ప్రకారం ఏడేళ్లు పాటు అన్ని గ్రామాలకు నాణ్యమైన ఎల్ఈడీ దీపాలను అందించాల్సి ఉంటుంది. ఇందుకోసం అన్ని గ్రామ పంచాయతీల నుంచి తీర్మానాలు చేసి పంపించాలని డీపీవోలకు పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఎల్ఈడీ దీపాలకు సంబంధించిన బిల్లులను పంచాయతీలు ఏడు సంవత్సరాల పాటు ఈఎంఐల రూపంలో చెల్లించవచ్చు.
నేషనల్ లైటింగ్ కోడ్ ప్రకారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన దీపాలను అలాగే ఉంచి, మిగిలిన ప్రాంతాలతో పాటు, ఎక్కడైనా పాతవి ఫెయిల్ అయితే వాటి స్థానంలో కూడా కొత్త దీపాలనుఏర్పాటు చేసే బాధ్యత ఈఈఎస్ఎల్ సంస్థదే. ఈ దీపాలు చీకటి పడగానే ఆటోమేటిక్గా ఆన్ అవడంతో పాటు, తెల్లవారగానే ఆఫ్ అవుతాయి.
నిర్వహణ బాధ్యతలు చూసేందుకు రెండు గ్రామాలకు కలిపి ఓ వ్యక్తిని సంస్థే నియమించనుంది. నాణ్యమైన ఎల్ఈడీ దీపాలను కేంద్ర ప్రభుత్వ సంస్థ తక్కువ ధరకే అందచేస్తున్నందున సుమారు 30 శాతానికి పైగా ఖర్చు ఆదా అయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పైగా డబ్బు కూడా వాయిదాల పద్ధతిలో చెల్లించే వెసులుబాటు ఉన్నందున గ్రామాలపై ఒత్తిడి కూడా ఉండదని అంటున్నారు.
More Stories
తెలుగు భాషను బతికించుకోవాలి
కాంగ్రెస్ పార్టీకి రూ.1823 కోట్ల ఐటీ నోటీసు
కాంగ్రెస్ లోకి కేశవరావు, కడియం శ్రీహరి