హైకోర్టులో ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్ డిస్మిస్

ఐపీఎస్‌ సీనియర్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్‌ చేసింది. ఆయుధాలు అక్రమ కొనుగోలు కేసు నమోదుపై అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో ఏబీ పిటిషన్ దాఖలు చేశారు. 
 
ప్రభుత్వం కేసు నమోదు చేయడానికి హైకోర్టు ఓ కేసు రిఫరెన్స్ ఇచ్చింది. దాని ప్రకారం కేసు నమోదు చేయకుంటే కోర్టు ధిక్కరణ కింద పిటిషన్‌ వేయాలని ఏబీకి హైకోర్టు సూచించింది. కేసు నమోదు చేయాలంటే ప్రభుత్వం నిబంధనలను పాటించాలని కోర్టు పేర్కొంది. 
 
గైడ్‌లెన్స్‌ను ప్రభుత్వం పాటించకుంటే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.  టీడీపీ ప్రభుత్వంలో వెంకటేశ్వరరావు ఇంటలిజెన్స్ ఛీప్‌గా పనిచేశారు.
అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇజ్రాయిల్ నుంచి సెక్యూరిటీ పరికరాలు కొనుగోలు విషయంలో నిబంధనలు ఉల్లంఘించారని ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆయనపై వైసీపీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఏబీ వెంకటేశ్వరరావు 1989 ఐపీఎస్‌ బ్యాచ్‌ అధికారి.
కాగా,  వెంకటేశ్వరరావును తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. విధుల్లోకి తీసుకోవడంతోపాటు సస్పెన్షన్‌ కాలం నాటి జీతభత్యాలు చెల్లించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను సమర్థిస్తూ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ఇచ్చిన ఆదేశాలను పక్కనపెట్టిన హైకోర్టు ఆయనను విధుల్లోకి తీసుకోవాల్సిందిగా ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.