చైనాకు ధీటుగా భారత్ క్షిపణిల మోహరింపు

తూర్పు లడఖ్‌లోని వాస్తవాధీన రేఖ(ఎల్‌ఎసి) వద్ద చైనాభారత్ మధ్య నెలకొన్న ప్రతిష్టంభన ఓవేళ పాక్షిక యుద్ధానికి లేదా పూర్తిస్థాయి యుద్ధానికి దారితీస్తే  భారత్  యుద్ధ రంగానికి కావాల్సిన అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేసుకున్నది.
సరిహద్దులో చైనా దూకుడుకు చెక్ పెట్టెందికురత్ సేనలు సర్వసిద్ధమవుతున్నాయి.
బ్రహ్మోస్, ఆకాష్, నిర్భయ్‌ క్షిపణులతో చైనా ముప్పుకు చెక్ పెట్టేందుకు భారత్ సిద్ధమైంది. లఢక్ సరిహద్దులో‌ని వ్యూహాత్మక సైనిక శిబిరాల్లో వీటిని మోహరించింది. చైనా, భారత్ సైన్యం మధ్య సరిహద్దులో ఘర్షణల నేపథ్యంలో టిబెట్, జిన్జియాంగ్‌లోని సైనిక కేంద్రాల్లో 2000 కిలోమీటర్ల లక్ష్యాలను చేధించగల క్షిపణులను చైనా మోహరించింది.
ఈ నేపథ్యంలో దీనికి కౌంటర్‌గా సూపర్ సోనిక్ బ్రహ్మోస్, సబ్ సోనిక్ నిర్భయ్, ఆకాష్ క్షిపణులను భారత్ మోహరించింది. చైనా నుంచి ఏదైనా ఊహించని పరిస్థితి ఎదురైతే ధీటుగా తిప్పికొట్టేందుకు అన్ని విధాలా సంసిద్ధమైంది.
 
 ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు సర్ఫేస్ బ్రహ్మోస్ క్షిపణులు 300 కిలోల బరువైన ఆయుధాలతో 500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను చేధిస్తాయి. సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానాల్లో వినియోగించేందుకు బ్రహ్మోస్ క్షిపణులను లఢక్ సెక్టార్‌తోపాటు నికోబార్ ఎయిర్‌బేస్‌లో మోహరించారు.

మరోవంక, చైనా క్షిపణిలు మోహరింపును ఎదుర్కునేందుకు మనదేశ సూపర్‌సానిక్ క్రూయిజ్ క్షిపణి నిర్భయ్‌ను  భారత్  విడుదల చేసింది. 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుల లక్ష్యాన్ని చేధించగల సూపర్‌సానిక్ క్రూయిజ్ క్షిపణి నిర్భయ్‌ భూమి నుండి 100 మీటర్ల నుండి నాలుగు కిలోమీటర్ల మధ్య ఎగురుతుంది. అదే సమయంలో ముందున్న లక్ష్యాన్ని చేధిస్తుంది.

 
ఇక ఆర్మీ ఎక్కువగా వినియోగించే ఆకాష్ క్షిపణులను భారీ సంఖ్యలో మోహరించారు. లఢక్‌ ప్రాంతంలోకి చైనా యుద్ధ విమానాలు ప్రవేశిస్తే వీటితో గట్టిగా బదులిస్తారు. రాడార్ రాజేంద్ర సహాయంతో ఒకేసారి 64 లక్ష్యాలను గుర్తించి ఏక కాలంలో 12 లక్ష్యాలను చేధించే సామర్థ్యం ఆకాష్ సొంతం. యుద్ధ విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులతో సహా అన్ని వైమానిక లక్ష్యాలను ఇది ధీటుగా ఎదుర్కోగలదు.
 
మరోవైపు ప్రస్తుతం ఆక్రమిత అక్సాయ్ చిన్‌లో చైనా వైమానిక కార్యకలాపాలు తక్కువ స్థాయిలోనే ఉన్నాయి. అయితే కరాకోరం పాస్ సమీపంలోని డౌలెట్ బేగ్ ఓల్డి సెక్టార్ అంతటా పీఎల్ఏ వాయు కార్యకలాపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో చైనా నుంచి ఎదురయ్యే ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు బ్రహ్మోస్, ఆకాష్, నిర్భయ్‌ క్షిపణులను భారత్ సిద్ధం చేసింది. ఇప్పటికే చలికాలంలో సైతం పనిచేసే యుద్ధ ట్యాంకులు, వాహనాలను లఢక్ సరిహద్దులో ఆర్మీ మోహరించిన సంగతి తెలిసిందే.