రాజ్యసభ నిరవధికంగా వాయిదా 

కోవిడ్-19 ప్రభావం పార్లమెంటు వర్షాకాల సమావేశాలపై పడింది. అనేక మంది ఎంపీలకు కరోనా వైరస్ సోకడంతో అక్టోబరు 1 వరకు జరగవలసిన సమావేశాలను కుదించవలసిన పరిస్థితి ఏర్పడింది. రాజ్యసభను బుధవారం నిరవధికంగా వాయిదా వేశారు.

లోక్‌సభ బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు సమావేశమైన తర్వాత సాయంత్రం 5 గంటలకు నిరవధికంగా వాయిదా పడే అవకాశం ఉంది. సెప్టెంబరు 14 నుంచి 10 రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో 25 బిల్లులకు ఆమోదం లభించింది. ఆరు బిల్లులను ప్రవేశపెట్టారు.

సాధారణంగా వర్షాకాల సమావేశాలు జూలైలో ప్రారంభమవుతాయి. ఈ ఏడాది కోవిడ్-19 మహమ్మారి వల్ల ఆలస్యంగా నిర్వహిస్తున్నారు. కోవిడ్-19 కేసుల విషయంలో అమెరికా తర్వాతి స్థానంలో భారత దేశం ఉంది. 

బుధవారం రాజ్య‌స‌భ ఆమోదించిన బిల్లుల్లో ఆక్యుపేష‌న‌ల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వ‌ర్కింగ్ కండిష‌న్స్ కోడ్-2020, ది ఇండ‌స్ట్రియ‌ల్ రిలేష‌న్స్ కోడ్‌-2020, అండ్ ది కోడ్ ఆన్ సోష‌ల్ సెక్యూరిటీ-2020 బిల్లులు, జ‌మ్ముక‌శ్మీర్ అధికారిక భాష‌ల బిల్లు-2020 ఉన్నాయి. అయితే అప్రాప్రియేష‌న్ (నెం.3) బిల్లు-2020, అప్రాప్రియేష‌న్ (నెం.4) బిల్లు-2020ల‌ను మాత్రం రాజ్య‌స‌భ తిప్పిపంపింది. 

కీలకమైన మూడు వ్యవసాయ బిల్లులను ఈ సమావేశాల్లో ఆమోదించారు. ఈ బిల్లులపై రాష్ట్రపతిని కలిసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి.