న్యూడెమోక్రసీ ప్రధాన కార్యదర్శి చంద్రన్న అరెస్ట్ 

సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ (చంద్రన్న వర్గం) అఖిల భారత ప్రధాన కార్యదర్శి పాతూరి ఆదినారాయణ స్వామి అలియాస్‌ పెద్ద చంద్రన్న, గుంటూరు జిల్లా కార్యదర్శి బ్రహ్మయ్య, మరో నాయకుడు దుర్గాప్రసాద్‌ను గుంటూరులో జంగారెడ్డిగూడెం పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు.
ప్రస్తుతం 73 సంవత్సరాల వయసున్న చంద్రన్న దాదాపు 53 ఏళ్లు రహస్య జీవితమే గడిపారు. ఆయన అరెస్ట్‌తో తొలితరం నక్సలైట్లలో  ఇక ఎవరూ అజ్ఞాతంలో లేనట్టే.  1967 నుంచి అజ్ఞాతంలో  పెద్ద చంద్రన్న ఉంటున్నది.
 1967లో ఆవిర్భవించిన సీపీఐ (ఎంఎల్‌).. గోదావరి పరీవాహక ప్రాంతంలో బలమైన ఉద్యమాన్ని నడుపుతున్న క్రమంలో 1984లో పార్టీలో సైద్ధాంతిక విభేదాల నేపథ్యంలో చీలిక ఏర్పడింది. దీనికి ముందు  చండ్ర పుల్లారెడ్డి (సీపీరెడ్డి)ని సిద్ధాంతపరంగా ఎదుర్కొన్న వారిలో రాయల సుభాష్‌చంద్రబోస్‌తోపాటు చంద్రన్న కూడా ఉన్నారు.
చీలిక అనంతరం ప్రజాపంథాగా ఆవిర్భవించిన పార్టీకి చంద్రన్న, రాయల బోస్, పైలా వాసుదేవరావు నాయకత్వం వహించారు. సీపీ రెడ్డి నేతృత్వంలోని మరో వర్గం విమోచన గ్రూపుగా ఏర్పడింది. ఇందులో కూర రాజన్న, మధు, అమర్, సత్తెన్న, ప్రసాదన్నలు సీపీకి అండగా నిలిచారు. ఇక ప్రజాపంథా కొంత కాలం తర్వాత ఎన్డీగా ఆవతరించింది.
 ఒక దఫా ఉమ్మడి ఎన్డీకి చంద్రన్న కేంద్ర కమిటీ కార్యదర్శిగా కూడా పని చేశారు. అయితే ఎన్డీలోనూ సిద్ధాంత పర విభేధాలు సంభవించి 2013లో చీలిక ఏర్పడింది. ఈ క్రమంలో పెద్ద చంద్రన్న నాయకత్వంలో ‘ఎన్డీ చంద్రన్న వర్గం’, రాయల బోసు నాయకత్వంలో ‘ఎన్డీ రాయల వర్గం’గా ఏర్పడ్డాయి. అయితే చీలిక అనంతరం ఎన్డీలోని రెండు వర్గాలు కూడా మరింత క్షీణ దశకు చేరుకున్నాయి.