మోదీని ఎన్‌డీఆర్‌ఎఫ్ నిధులు కోరిన యడియూరప్ప

ప్రకృతి వైపరీత్యాల స్పందన నిధి (ఎన్‌డీఆర్‌ఎఫ్) నుంచి సత్వరం రాష్ట్రానికి నిధులను విడుదల చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఈ మేరకు ఒక ప్రకటనను శుక్రవారంనాడు విడుదల చేసింది. 
 ‘ఎన్‌డీఆర్‌ఎఫ్ నుంచి త్వరితగతిని నిధులు విడుదల చేయాలని ప్రధానికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. విపత్తుల్లో ఉన్న ప్రజలకు తగిన ఆర్థిక చేయూత ఇచ్చేందుకు వీలుగా ఈ ఏడాది ఎన్డీఆర్‌ఎఫ్ నుంచి అందించే సాయం నిబంధనలను రివైజ్ చేయాలని కూడా కోరారు’ అని సీఎంఓ కార్యాలయం ఆ ప్రకటనలో పేర్కొంది.
ఎగువ కృష్ణా ప్రాజెక్ట్ స్టేజ్-3, ఎగువ భద్రా ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటించాలని, మేకెదాటు, కలస బండూరి నాలా సహా పలు నీటి పారుదల, తాగునీటి ప్రాజెక్టులకు త్వరితగతిన క్లియరెన్స్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కూడా ప్రధానిని సీఎం కోరారు.
ప్రధాని నరేంద్ర మోదీతో 15 నిమిషాల పాటు యడియూరప్ప ఫోనులో మాట్లాడరని, నవంబర్ 19న జరిగే ‘బెంగళూరు టెక్ సదస్సు’ను వర్చువల్ కాన్ఫెరెన్స్ ద్వారా ప్రారంభించాలని మోదీని యడియూరప్ప ఆహ్వానించారని సీఎంఓ తెలిపింది.