ఇండో-పసిఫిక్‌లో చైనాకు అమెరికా చెక్   

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనాకు చెక్ పెట్టేందుకు చర్యల్లో భాగంగా రక్షణ సహకారం కోసం మాల్దీవులతో కలిసి పనిచేసేందుకు అమెరికా సిద్దమైంది. ఇందులోభాగంగా ఒక ఫ్రేమ్ వర్క్ పై అమెరికా సంతకం చేసింది. హిందూ మహాసముద్రంలో వ్యూహాత్మకంగా ఎదిగేందుకు అమెరికా పావులు కదుపుతున్నది.

చైనా అభివృద్ధిని ఎదుర్కోవటానికి ఇండో-పసిఫిక్‌లో పొత్తులను బలోపేతం చేయడానికి అమెరికా కసరత్తు చేస్తున్నది. దక్షిణ, ఆగ్నేయాసియా రక్షణ సహాయ కార్యదర్శి రీడ్ వెర్నెర్, మాల్దీవుల రక్షణ మంత్రి మరియా దీదీల మధ్య సెప్టెంబర్ 10 న ఫిలడెల్ఫియాలో రక్షణ, భద్రతా సంబంధాల ముసాయిదాపై సంతకాలు చేసిన్నట్లు పెంటగాన్  వెల్లడించింది.

“హిందూ మహాసముద్రంలో శాంతి భద్రతలను కాపాడటానికి మద్దతుగా సహకారాన్ని మరింతగా పెంచే ఇరు దేశాల ఉద్దేశ్యాన్ని ఈ ఒప్పందం నిర్దేశిస్తుంది. అలాగే రక్షణ భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన ముందడుగును సూచిస్తుంది” అని పెంటగాన్ తెలిపింది.

ఇండో-పసిఫిక్, హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతి భద్రతలు ఇరు దేశాల ప్రయోజనాలతో ముడిపడి ఉన్నాయని మాల్దీవుల రక్షణ మంత్రి మరియా దీదీ పేర్కొన్నారు. పైరసీ, హింసాత్మక ఉగ్రవాదం, అక్రమ వాణిజ్యం వంటి పెరుగుతున్న బహుళజాతి బెదిరింపుల నేపథ్యంలో ఈ ముసాయిదాకు ఎంతో ప్రాముఖ్యం ఉన్నదని తెలపారు.

అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం సీనియర్ స్థాయి చర్చలు, ఒప్పందాలు, సముద్ర డొమైన్ అవగాహన, ప్రకృతి వైపరీత్యాలు, మానవతా సహాయక చర్యల వంటి రంగాలలోని అవకాశాలతో సహా అనేక ద్వైపాక్షిక కార్యకలాపాలను ఈ ఫ్రేమ్‌వర్క్ వివరిస్తుంది. మాల్దీవులు, అమెరికా మధ్య రక్షణ, భద్రతా సహకారంలో మాల్దీవుల ప్రభుత్వం ఈ ఒప్పందం “ముఖ్యమైన మైలురాయి” గా చూస్తుందని మరియా దీదీ చెప్పారు.

సెంట్రల్ ఇండో-పసిఫిక్‌లో భారతీయ, పసిఫిక్ మహాసముద్రాలను కలిపే అనేక సముద్రాలు, జలసంధి ఉన్నాయి. వనరులు సమృద్ధిగా ఉన్న ఇండో-పసిఫిక్ ప్రాంతంపై చైనా తన ప్రభావాన్ని విస్తరించడానికి ప్రయత్నిస్తున్నది. వ్యూహాత్మకంగా ముఖ్యమైన ప్రాంతంలో భారతదేశం యొక్క విస్తృత పాత్ర కోసం అమెరికా కూడా ప్రయత్నిస్తున్నది.

హిందూ మహాసముద్ర ప్రాంతంలో తన ప్రభావాన్ని విస్తరించడానికి చైనా దృష్టి సారించింది. అరేబియా సముద్రంలో పాకిస్తాన్ యొక్క వ్యూహాత్మక గ్వాడార్ నౌకాశ్రయాన్ని చైనా ఇప్పటికే స్వాధీనం చేసుకున్నది. దక్షిణ చైనా సముద్రంలో, తూర్పు చైనా సముద్రంలో జపాన్‌తో తీవ్రంగా పోటీపడుతున్న ప్రాదేశిక వివాదాలలో చైనా నిమగ్నమై ఉన్నది.

ఈ రెండు ప్రాంతాల్లో ఖనిజాలు, చమురు, ఇతర సహజ వనరులు అధికంగా ఉన్నాయని నిపుణులు చెప్తుంటారు. బీజింగ్ దాదాపు దక్షిణ చైనా సముద్రం తమదని పేర్కొంటున్నది. వియత్నాం, ఫిలిప్పీన్స్, మలేషియా, బ్రూనై, తైవాన్ దేశాలు కూడా జలమార్గంలో అతివ్యాప్తి చెందుతున్నాయి.