టాలీవుడ్‌కు బాలీవుడ్ డ్రగ్ ప్రకంపనలు

ఆత్మహత్యకు పాల్పడిన సుశాంత్ సింగ్ ప్రియురాలు రియా చక్రవర్తి ఎన్‌సిబి విచారణలో డ్రగ్స్ వ్యవహారంలో కీలక వ్యాఖ్యలు చేయడంతో బాలీవుడ్ ప్రకంపనలు టాలీవుడ్‌కూ విస్తరిస్తూ తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖలు పేర్లు తెరపైకి వచ్చాయి. రియా చక్రవర్తి నిత్యం డ్రగ్స్ తీసుకునే 25 మంది పేర్లను వెల్లడించగా అందులో టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటి రకుల్ ప్రీత్‌సింగ్ పేరు తెరపైకి వచ్చింది. 

రియా తన స్నేహితురాలు రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్ పేర్లను వెల్లడించడం సంచలనంగా మారింది. రకుల్‌తో పాటు మరో 10 మంది టాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే డ్రగ్స్ వ్యవహారంలో తనకు సంబంధం లేదని అంటూ ముందుగానే  హీరో నవదీప్ తేల్చిచెప్పాడు.

2017 లో డ్రగ్స్ కేసులో 15 మంది టాలీవుడ్ ప్రముఖులు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై కేసు నమోదు చేసిన తెలంగాణ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిట్ అధికారులు దర్శకుడు పూరీ జగన్నాథ్, నటులు రవి తేజ, ఛార్మి, తరుణ్, నవదీప్, ముమైత్ ఖాన్, సుబ్బరాజు,తనీష్ లతో పాటు మరికొందరిని విచారించారు.

అందరి రక్తం, వెంట్రుకల నమూనాలు తీసుకుని వాటిని పరీక్షలకు పంపారు. అనుమానితుల్లో చాలా మంది డ్రగ్స్ వాడినట్లు అధికారులు గుర్తించారు. ఛార్జ్ షీట్ లో కూడా సిట్ ఈ విషయాన్ని ప్రస్తావించింది. అయితే ఆ తర్వాత ఆ కేసు గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇప్పటికీ టాలీవుడ్ లో చాలా మంది డ్రగ్స్ వాడుతున్నారని చర్చ జోరుగా సాగుతూనే ఉంది.

పలువురు ప్రముఖులు డ్రగ్స్ వాడుతున్నట్లు ఇప్పటికే పోలీసులు, ఎక్సైజ్ అధికారుల విచారణలో వెల్లడైంది. కాగా తాజాగా రియా చేసిన సంచలన వ్యాఖ్యలతో మరోసారి డ్రగ్స్ వ్యవహారం తెరపైకి వచ్చింది. రియా చేసిన వ్యాఖ్యలతో నార్కోటెక్ కంట్రోల్ బ్యూరో టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసులో పాత నిందితులను విచారించేందుకు సన్నాహాలు ప్రారంభించారు.

ఈక్రమంలో రకుల్‌ప్రీత్ సింగ్ పేరు తాజాగా తెరపైకి రావడంతో శనివారం వికారాబాద్ శివారులో ఓ సినిమా షూటింగ్‌లో ఉన్న హుటాహుటిన షూటింగ్‌కు ప్యాకప్ చెప్పి జూబ్లీహిల్స్ నివాసానికి వెళ్లినట్లు తెలుస్తోంది.

మరోవైపు టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారంపై నార్కోటెక్ కంట్రోల్ బ్యూరో శనివారం సాయంత్రం అత్యవసరంగా సమావేశమైంది. డ్రగ్స్ కేసులో ఆరోపణలను ఎదర్కొంటున్న వారికి నోటీసులు పంపిన అనంతరం జరిగే పరిణామాలపై వారు చర్చించారు. బాలీవుడ్‌లో రియా అరెస్ట్‌తో మొదలైన పర్వం బెంగళూరులో బుజ్జిగాడు బ్యూటీ సంజనా వరకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ కేసులో మరికొంత మందిని ఎన్‌సిబి అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.