పీఎంవోలో డిప్యూటీ సెక్రటరీగా ఆమ్రపాలి

యువ ఐఎఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి పిఎంఒలో చోటు దక్కింది. పిఎంఒలో డిప్యూటీ సెక్రటరీగా ఆమె నియమితులయ్యారు. ఈ మేరకు కేబినెట్‌ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. 
 
ప్రస్తుతం ఆమె కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. విశాఖపట్నంలో పుట్టిన ఆమ్రపాలిచెన్నై ఐఐటి నుండి బిటెక్‌, బెంగళూరు ఐఐఎం నుంచి ఎంబిఎ పూర్తి చేశారు. అనంతరం 2010 యుపిఎస్‌లో ఆలిండియా 39వ ర్యాంక్‌ను సాధించారు. 
 
ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సేవలు అందించారు. వికారాబాద్‌ సబ్‌-కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా, వరంగల్‌ కలెక్టర్‌గా, తెలంగాణ ఎన్నిక సంఘం అధికారిణిగా సేవలందించారు. 
 
వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌గా ఉన్న సమయంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా, ఆమ్రపాలితో పాటు మరో ఇద్దరు ఐఎఎస్‌ అధికారులను పిఎంఒకు ఎంపిక చేశారు.