మరోసారి ఎయిమ్స్‌లో చేరిన  అమిత్‌ షా

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మరోసారి స్వల్ప అనారోగ్యంతో శనివారం అర్ధరాత్రి ఎయిమ్స్‌లో చేరారు. ఆయన శ్వాస సంబంధ సమస్య ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. వీవీఐపీల కేటాయించిన సీఎస్‌ టవర్‌లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. 
 
ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా ఆధ్వర్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్య బృందాలు పర్యవేక్షిస్తున్నాయి. అతని పరిస్థితి నిలకడగానే ఉందని ఎయిమ్స్‌ వర్గాలు తెలిపాయి.  ఆగస్టు 2న కరోనా బారినపడిన అమిత్‌ షా గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పటల్‌లో చికిత్స పొందారు. 
 
14వ తేదీన ఆయనకు నెగిటివ్ రాగా.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ క్రమంలో హోం ఐసోలేషన్‌లో ఉన్న అమిత్ షాకు శ్వాసకోశ సమస్య, ఇతర అనారోగ్య పరిస్థితలు తలెత్తడంతో 18న తిరిగి ఎయిమ్స్‌లో చేరారు. ఆగస్టు 31న ఆయన అక్కడి నుంచి డిశ్చార్జి అయిన సంగతి  తెలిసిందే.